హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన రీసైక్లింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ స్టార్టప్ బన్యాన్ నేషన్ అరుదైన ఘనత సాధించింది. ఈ సంస్థను వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2021కు గాను టెక్నాలజీ పయనీర్ గా గుర్తించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ఏర్పాటైన ఈ స్టార్టప్ ను మణి వాజపేయాజుల, రాజ్ కిరణ్ మదన్ గోపాల్ లు స్థాపించారు. ప్లాస్టిక్ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ రెండు రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.
అసంఘటిత రీసైక్లర్లను సరఫరా గొలుసులో అనుసంధానించడానికి మొబైల్ టెక్నాలజీని అందించడం, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి కలుషితాలను తొలగించడానికి , రీసైకిల్ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. గత ఏడాది ఈ దిశగా కంపెనీ తమ రీసైకిల్డ్ ప్లాస్టిక్ ను ప్రముఖ ఎఫ్ఎంసీజీలు ఉపయోగించేలా సహకరించింది.
ఆయా కంపెనీలు తమ రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో 100 మిలియన్ షాంపూ, లోషన్ బాటిల్స్ ను తయారు చేసేలా బన్యాన్ నేషన్ చొరవ చూపింది. 2030 నాటికి ఏటా పదివేల టన్నుల వర్జిన్ పాలిమర్స్ ను రీసైకిల్డ్ ప్లాస్టిక్స్ తో భర్తీ చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇక డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత్ నుంచి బన్యాన్ నేషన్, కోల్ కతా కు చెందిన వీడియోనెటిక్స్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి.