చార్మినార్, జూన్ 15 : తన నేరచరిత్రపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి స్నేహితుడిపై కక్ష పెంచుకుని.. మరో ఇద్దరితో కలిసి అతన్ని హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను హుస్సేనిఅలం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్ వివరాలు వెల్లడించారు.. బహదూర్పుర ప్రాంతానికి చెందిన సయ్యద్ జుబేర్ (22) పండ్ల వ్యాపారి. కామాటిపుర పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాజీపుర, ఫత్తేదర్వాజా ప్రాంతానికి చెందిన సలాం బిన్ అబ్దుల్లా, చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన తారిక్అలీ స్నేహితులు. కాగా.. కొంతకాలంగా సయ్యద్ జుబేర్తో సలాం బిన్ అబ్దుల్లాకు గొడవ జరుగుతున్నది.
అయితే.. తన నేరాలపై పోలీసులకు సమాచారం అందించి.. తన అరెస్ట్కు వారికి సహకరించాడని జుబేర్పై.. కక్ష పెంచుకుని అతన్ని చంపాలనుకున్నాడు. ఇందుకు స్నేహితులు తారిక్ అలీ, మహ్మద్ ముజఫర్అలీ ఖాన్ల సహాయం కోరాడు.. ఈ ముగ్గురు కలిసి ఈ నెల 12న మద్యం తాగుదామని జుబేర్కు ఫోన్చేసి శాలిబండ ప్రాంతానికి రప్పించారు. ఆషా టాకీస్ ప్రాంగణంలో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న భవన సముదాయంలోకి ఆ నలుగురు మద్యం తాగారు. ఈ క్రమంలో జుబేర్పై కత్తులతో దాడిచేసి చంపారు. సమాచారం అందుకున్న హుస్సేనిఅలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం షాహీన్నగర్లోని ఓ చెరువు వద్ద ఆ ముగ్గురు నిందితులను అరె స్ట్ చేశారు. సమావేశంలో అదనపు డీసీపీ రఫీక్, ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.