ముంబై : ప్రధాని నరేంద్ర మోదీతో తమ అనుబంధం చెక్కుచెదరలేదని శివసేన అగ్రనేతలు పేర్కొన్న నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను రాజకీయ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలోని పవార్ నివాసంలో కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య భేటీపై రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. పాలక బీజేపీని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో, 2022లో జరిగే యూపీ ఎన్నికల్లో మట్టికరిపించేందుకు విపక్షాలు కూటమిగా జట్టుకడతాయనే అంచనాల మధ్య పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు తాము రాజకీయంగా ప్రస్తుతం వేర్వేరు దారుల్లో ఉన్నా ప్రధాని మోదీతో అనుబంధం తెంచుకోలేదని శివసేన నేతలు బాహాటంగా వ్యాఖ్యానించిన క్రమంలో పవార్, ప్రశాంత్ కిషోర్ ల మధ్య సంప్రదింపులపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక మహారాష్ట్ర సీఎం, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానితో ముఖాముఖి సమావేశమయ్యారు. మరాఠాల రిజర్వేషన్ సహా పలు అంశాలపై ఠాక్రే ప్రధానితో ముచ్చటించారు.