హిమాయత్నగర్, జూన్ 9: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాలాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించేందుకు పూడికతీత పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణగూడలోని నాలాను పరిశీలించి, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షం నీరు సులభంగా నాలాల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తిచేయాలన్నారు.
గతేడాది వచ్చిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి, ఈసారి ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూడికతీత పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, ఎఎంహెచ్వో డాక్టర్ హేమలత, హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, మాజీ కార్పొరేటర్ హేమలత యాదవ్, ఇంజినీరింగ్ విభాగం ఏఈ ఫరీద్, టీఆర్ఎస్ నేత జె.బాబుయాదవ్, బీజేపీ నాయకులు జి.రామన్గౌడ్, నర్సింగ్గౌడ్, జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.