సూర్యాపేట సిటీ, జూన్ 8 : ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.60లక్షల విలువైన 3టన్నుల విత్తనాలను స్వాధీనం చేసుకొని ఏడుగురిని అరెస్టు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. అర్వపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన కొమ్మలపాటి శ్రీనివాస్ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అర్వపల్లి ఎస్ఐ మహేశ్ తన సిబ్బందితో వలపన్ని ద్విచక్ర వాహనంపై విత్తనాలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. శ్రీనివాస్ను విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన తన సోదరుడు సతీశ్ సహాయంతో కర్ణాటక రాష్ట్రం నాచవరానికి చెందిన పెంట్యాల వీరాంజనేయులు ద్వారా అక్కడి నుంచి విత్తనాలు తీసుకొచ్చినట్లు తెలిపాడు. వీరాంజనేయులు, చెన్నూరు కొండల్రావు సహాయంతో 20 ఎకరాల్లో బీటీ2, నాచవరం ప్రాంతంలో 12 ఎకరాల్లో బీటీ3 రకం పండించి ప్రత్యేక మిల్లుల్లో రసాయనాల ద్వారా శుద్ధి చేయించి తెలంగాణలో విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఈ ముఠాలో వీరాంజనేయులు పెద్ద నాన్న కొడుకు రామాంజనేయులు కూడా ఉన్నాడు. 2019లో వీరాంజనేయులుపై కల్వకుర్తి పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా.. బెయిల్పై వచ్చిన అతను హైదరాబాద్లోని కొంపల్లిలో ఉంటూ నకిలీ విత్తనాల దందా నడిపిస్తున్నాడు. శ్రీనివాస్ సమాచారంలో వారి నుంచి 2,490 కిలోల పత్తి విత్తనాలు, ఒక ఎర్టిగా కారు, ఒక బైక్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి వీరాంజనేయులు పరారీలో ఉండగా మిగిలిన వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
తుంగతుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన జటంగి సత్యనారాయణ నకిలీ పత్తి విత్తనాలు నిల్వ చేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని 72కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా కేశవాపురం గ్రామానికి చెందిన తుమురాల మురళి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఆ సమాచారంతో మురళిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 135 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మురళిని విచారించగా మునగాలకు చెందిన నాగార్జునపు విజయ్భాస్కర్ నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పాడు. దీంతో విజయ్భాస్కర్ నుంచి 125 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన రవి నుంచి కొనుగోలు చేసినట్లు విజయ్భాస్కర్ తెలిపాడు. రవిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. పరారయ్యాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. పై రెండు సంఘటనల్లో అర్వపల్లి, తుంగతుర్తిలో ఒక్కో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాల ముఠాను అరెస్టు చేసిన కేసులో సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్కుమార్, తుంగతుర్తి సీఐ జి.రవి, నాగారం సీఐ టి.శ్రీనివాస్, ఎస్ఐలు కె.మహేశ్, ఆంజనేయులు, హరికృష్ణ, సాయిప్రశాంత్, వై.ప్రసాద్, టాస్క్ఫోర్స్ ఎస్ఐ శివకుమార్, సిబ్బందిని ఎస్పీ భాస్కరన్