రాయగడ: ఒడిశాలోని గునుపూర్ సబ్జైలులో కరోనా కలకలం సృష్టించింది. రాయగఢ జిల్లాలో ఉన్న గునుపూర్ సబ్ జైలులోని మొత్తం 113 మంది ఖైదీల్లో 70 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఖైదీలతోపాటు మరో ఐదుగురు జైలు ఉద్యోగులకు కూడా కరోనా సోకింది. మహమ్మారి బారినపడినవారిని ఐసోలేషన్లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ కామాక్ష్య ప్రసాద్ చెప్పారు. జైలు ఆవరణను శానిటైజ్ చేయించామని, మిగిలిన ఖైదీలను వేరుగా ఉంచామని చెప్పారు. రాష్ట్రంలోని జైళ్లలో తాజాగా మొత్తం 816 మందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. కాగా, రాష్ట్రంలో నిన్న 6,118 కరోనా కేసులు నమోవగా 41 మంది మరణించారు.