హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఇంటి వద్దే వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారికి యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (యూఎఫ్ఈఆర్డబ్ల్యూఎస్) సరికొత్త యాప్ను సిద్ధం చేసింది. వివరాలు పొందుపరిస్తే చాలు ఇంటి వద్దే వ్యాక్సిన్ క్యాంపు ఏర్పాటు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్కు చక్కటి పరిష్కారం చూపేలా రూపొందించిన ఐ-వ్యాక్సినేట్ యాప్ను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆదివారం వర్చువల్గా ఆవిష్కరించారు. యాప్ డౌన్లోడ్ చేసుకొని వివరాలు పొందుపరిస్తే, డిమాండ్ను బట్టి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులతో మాట్లాడి వ్యాక్సిన్ క్యాంపులను ఏర్పాటు చేస్తారని యూఎఫ్ఈఆర్డబ్ల్యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ తెలిపారు. గృహాలు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు ఏర్పాటు చేస్తారని, వ్యాక్సినేషన్ సత్వరమే పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం దీంతో నెరవేరుతుందని అన్నారు. ఈ యాప్ ద్వారా అవసరమైన వారికి ఇంటికి వద్దకే మందులు కూడా సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు ప్రైవేటు టెలీమెడిసిన్, కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫ్రీ మెడికేషన్ వెబినార్స్ నిర్వహించడంతోపాటు, అవసరమైన హెల్త్కేర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చే వారికి ఎక్కవగా ఆక్సిజన్ను విడుదల చేసే మొక్కలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.