విక్రయదారులపై పీడీ యాక్ట్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో టాస్క్ఫోర్స్
నిత్యం విస్తృతంగా తనిఖీలు
పర్యవేక్షిస్తున్న ఆయా జిల్లాల ఉన్నతాధికారులు
ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు
ఆదిలాబాద్, మే 31 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి):వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో అధికారులు నకిలీ విత్తనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పత్తితో పాటు ఇతర విత్తనాలు, ఎరువులు, అనుమతి లేని పురుగు మందుల విక్రయాలు అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్,నిర్మల్ జిల్లాల్లో, వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లోనూ పత్తి విత్తనాల విక్రయాలు ప్రారంభం కాగా, అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ‘నకిలీ’ దందా కొనసాగించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా, రైతులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.
జిల్లాలో వానకాలం సీజన్ కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో రెండు జిల్లాల్లో కలిపి రైతులు 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పత్తి, కంది, సోయాబీన్, నిర్మల్లో వరి, పత్తి పంటలను సాగు చేస్తారు. కాగా, దుకాణాల్లో ఇప్పటికే విత్తనాలు, ఎరువుల అమ్మకాలు ప్రారంభం కాగా రైతులు తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాల విక్రయాలు జరుగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన ఈ తనిఖీ బృందాలు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తాయి. దుకాణాల్లో అమ్ముతున్న విత్తనాలు వివరాలను పరిశీలిస్తారు. రైతులకు విక్రయించే విత్తనాలకు సంబంధించిన బిల్లులు సరిగా ఇస్తున్నారా లేదా, స్టాక్, ఇతర వివరాలను తెలుసుకుంటారు. విత్తనాలు, ఎరువుల గోదాముల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి పలు సూచనలు చేస్తారు.
పీడీ యాక్టు ప్రయోగం
నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించడంతో పాటు కేసులు నమోదు చేస్తారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొందరు దళారులు మహారాష్ట్ర, ఏపీ, గుజరాత్ రాష్ర్టాల నుంచి కల్తీ విత్తనాలు, బీటీ 3 పత్తి విత్తనాలు, ైగ్లెఫోసెట్ గడ్డి మందులను అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తారు. గ్రామాల్లో రైతులకు వాయిదా పద్ధతిలో తక్కువ ధరలకు అంటగడతారు. పంటలో గడ్డి కలుపు నివారణలో భాగంగా బీటీ-3 పేరిట జిల్లాల్లో పత్తి విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ విత్తనాలు వేసిన రైతులు ైగ్లెఫోసెట్ గడ్డి మందును ఒక్కసారి చల్లితే పంటకాలం వరకు కలుపు సమస్య ఉండదు. హానికరమైన ఈ పురుగు మందును అనుమతులు లేకుండా కొందరు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. వీటిపై కూడా తనిఖీ బృందాలు నిఘా పెడుతాయి. నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం పోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు ఫిర్యాదు చేయడం కోసం 9440900635, నిర్మల్ జిల్లాలో 9440900680 నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు.