పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు
వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ పూర్తి
పచ్చదనం పరుచుకున్న ప్రకృతివనం
ఇంటింటికీ చెత్త సేకరణతో పరిశుభ్రంగా గ్రామం
ఆత్మకూరు(ఎం), మే 26 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఫలితాలు ఇస్తున్నది. మండలంలోని రాయిపల్లి అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. గ్రామంలో 900 మంది జనాభా ఉండగా 630 మంది ఓటర్లు ఉన్నారు. 240 ఇండ్లు ఉన్నాయి. రెండు సంవత్సరాల్లో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
రూ.19 లక్షలతో అభివృద్ధి పనులు
గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.19 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజల అవసరాల కోసం రూ.12లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల 50వేలతో కంపోస్ట్షెడ్ నిర్మాణం, రూ.లక్షతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, రూ.లక్షా 50వేలతో వైకుంఠధామానికి వెళ్లే దారి కోసం మరమ్మతు పనులు, రూ.లక్షా 40వేలతో పాత ఇండ్లు, పాడావుపడ్డ పాత బావుల పూడ్చివేత పనులు చేపట్టారు.
పచ్చదనం.. పరిశుభ్రంగా గ్రామం…..
ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల వెంట రెండు వేల మొక్కలు నాటి సంరక్షించారు. గ్రామస్తులకు 1500 మొక్కలు పంపిణీ చేయగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతో నేడు ఏపుగా పెరిగిన మొక్కల వల్ల పచ్చదనం సంతరించుకున్నది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజూ గ్రామ పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్షెడ్కు తరలిస్తున్నారు. పారిశుధ్య పనుల్లో భాగంగా వీధులతో పాటు మురుగుకాల్వలను శుభ్రపర్చడంతో నేడు గ్రామంలో ఎటు చూసినా పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా కనబడుతున్నది.
పల్లె ప్రగతి వరంలా మారింది
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులు వరంలా మారాయి. అన్ని వర్గాల కోసం గ్రామంలో వైకుంఠధామం, కంపోస్ట్షెడ్ నిర్మాణ పనులు చేపట్టడం సంతోషంగా ఉంది. రెండు సంవత్సరాల్లో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అందించిన సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. మున్ముందు కూడా గ్రామస్తులకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతాం. -పంజాల సుమతీశ్రీనివాస్గౌడ్, సర్పంచ్, రాయిపల్లి
పల్లె ప్రగతి పనుల పై పర్యవేక్షణ
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులను ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నాం. వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో పాటు పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో నేడు పచ్చదనం సంతరించుకున్నది. పారిశుధ్య పనులు చేపట్టడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది.
-పద్మావతి, మండల పంచాయతీ అధికారి, ఆత్మకూరు(ఎం)
గ్రామం శుభ్రంగా ఉంది
గ్రామంలో ప్రతి రోజూ వీధులన్నీ శుభ్రంగా ఊడ్చడంతో పాటు మురుగు కాల్వలను శుభ్రపర్చుతున్నారు. పంచాయతీ సిబ్బంది చెత్తను ట్రాక్టర్ ద్వారా తీసుకుపోవడంతో గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తున్నది. రోడ్ల వెంటరెండు వైపులా పచ్చని చెట్లు కనబడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్సారుకు రుణపడి ఉంటాం.
-గాసుల రజనమ్మ, గ్రామస్తురాలు, రాయిపల్లి
ఆహ్లాదాన్ని కలిగిస్తున్న పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ప్రధాన రోడ్డును ఆనుకొని ఉన్న పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరగడంతోపాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. గ్రామంలోని ప్రధాన వీధుల వెంట నాటిన మొక్కలు వల్ల పచ్చదనం సంతరించుకున్నది.
-బెజ్జెరబోయిన సత్యనారాయణ, గ్రామస్తుడు, రాయిపల్లి