నల్లగొండ ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. తొలి దఫాగా పది రోజుల లాక్డౌన్ను ప్రకటించిన సర్కారు దాన్ని మరో పది రోజులకు పొడిగించింది. లాక్డౌన్ పొడిగింపు సమయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమీక్ష చేస్తూ మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. దీంతో ఆయా జిల్లా యంత్రాంగాలు సీరియస్గా దృష్టి సారించాయి. లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఉన్న వారు మినహా ఇతరులెవరూ అనవసరంగా రోడ్లపైకి వచ్చినా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే కరోనా వైరస్కు కళ్లెం వేయగలుగుతున్నారు.
అందుకు లాక్డౌన్ రోజుల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యనే నిదర్శనం. నల్లగొండ జిల్లాలో మార్చి నుంచి సోమవారం వరకు పాజిటివ్ కేసుల శాతాన్ని పరిశీలిస్తే 13 శాతంగానే ఉంది. మార్చిలో చాలా నామమాత్రంగా, ఏప్రిల్ మధ్య నుంచి భారీగా పెరుగుదల, మళ్లీ మే నెల మధ్య నుంచి మళ్లీ గణనీయంగా తగ్గుదల కనిపిస్తున్నది. మార్చిలో1.1శాతం నమోదు కాగా ఏప్రిల్లో అది 14.2 శాతానికి పెరిగింది. ఇక ఈ నెల 15 నాటికి అది 30.6 శాతానికి విస్తరించింది. దాదాపు ఏప్రిల్ 15 నుంచి అనూహ్యంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్కు సిద్ధమైంది. లాక్డౌన్తో కరోనా వ్యాప్తి వేగానికి కట్టడిపడినట్లుగానే ప్రస్తుతం నమోదువుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య స్పష్టం చేస్తుంది.
లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యలు చేపట్టడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. కేవలం నాలుగు గంటల పాటు సడలింపునిచ్చి మిగితా సమయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు.ప్రస్తుత మేలో కరోనా పరీక్షలు, పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. ఈ నెల 1న 30.1 పాజిటివ్ రేషియోతో 2,528 పరీక్షలు చేస్తే 760 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇదే రేషియో ఒక శాతం అటూ ఇటుగా ఈ నెల 15 వరకు కొనసాగింది. 15వ తేదీన కూడా 30.3 పాజిటివ్ శాతంతో 1,907 పరీక్షలు చేస్తే 577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ ఈ నెల 12న మొదలైన అనంతరం కూడా ఈ నెల 15 వరకు కూడా ఇదే నిష్పత్తితో పాటిజివ్ కేసులు రిపోర్టయ్యాయి. మే లో15 నాటికి మొత్తం 37,472 పరీక్షలు నిర్వహిస్తే 30.6శాతం పాజిటివ్ శాతంతో 11,497 కేసులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి లాక్డౌన్ ఎఫెక్ట్ స్పష్టంగా వెల్లడైంది. అయితే అంతకు ముందు ఉన్న ప్రభావంతో లాక్డౌన్ మొదలైన తర్వాత నాలుగు రోజుల పాటు కేసుల సగటు అలాగే కొనసాగినట్లుగా వైద్యాధికారులు అంచనా వేశారు.
16 నుంచి స్పష్టమైన మార్పు.
లాక్డౌన్ ప్రభావం ఈ నెల 16 నుంచి స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. అప్పటి నుంచి పాజిటివ్ రేషియో గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల 16 నుంచి సోమవారం వరకు 9 రోజుల పాటు పరిశీలిస్తే 20.52శాతం పాజిటివ్ రేషియో నమోదైంది. ఇదంతా కట్టుదిట్టమైన లాక్డౌన్ వల్లనే సాధ్యమైందనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఈ నెల 16న 22.5శాతం, 17న 22.5 శాతం, 18న 26.6శాతం, 19న 18.9శాతం, 20న 18.9 శాతం, 21న 21.9 శాతం, 22న 18.5శాతం, 23న 17.6శాతం, 24వ తేదీన 18.9 శాతం పాజిటివ్ రేషియో నమోదైంది. లాక్డౌన్ కంటే ముందు లెక్కలతో పోలిస్తే 10శాతం పాజిటివ్ రేషియో తగ్గిపోయినట్లు స్పష్టం అవుతుంది. ఈ తొమ్మిది రోజుల్లో కలిపి మొత్తం 15,877 కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో 20.52 శాతం పాజిటివ్ రేషియోతో 3,258 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా లెక్కలు వెల్లడిస్తున్నాయి.
రూ.4 లక్షలకు పైగా జరిమానా..
లాక్డౌన్లో మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది. ప్రారంభంలో కొంత ఫ్రీగా వదిలేసినట్లు అనిపించినా మూడు రోజులుగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లాక్డౌన్ ఉల్లంఘనల కింద రూ.4 లక్షల పైచిలుకు జరిమానాలు విధించారు. 850 కేసుల నమోదుతో పాటు 700 పైచిలుకు వాహనాలను సీజ్ చేశారు. ఈ పిట్టీ కేసులు 2500 వరకు, ఈ చాలాన్లు 3,500 వరకు సుమారుగా విధించారు. జాతీయ రహదారిపై ఏడు చోట్ల తనిఖీలు చేస్తూ అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నల్లగొండలో 25, మిర్యాలగూడలో 30, దేవరకొండలో 10 చోట్ల బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. ఇక అన్ని మండలాల్లో నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో గల్లీలను వదలడం లేదు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.దీంతో ప్రజలు బయటకు రావడం లేదు. జిల్లా ఎస్పీ రంగనాథ్, ఏఎస్పీ నర్మద క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్య వేక్షిస్తున్నారు.