భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ రాగల 12 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్గానూ మారుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ మే 26 ఉదయానికి ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రస్తుతం ఈ తుఫాన్ పారదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశలో 530 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని, ఈ నెల 26న అది ఒడిశాలోని పారాదీప్-బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. యాస్ తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై తీవ్రప్రభావాన్ని చూపనుందన్నారు.
ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. భువనేశ్వర్- పూరి, పూరి-చెన్నై మధ్య నడిచే 90 రైళ్లు రద్దయ్యాయి. మరో 10 రైళ్ళను కూడా రద్దుచేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.