డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంలో మంత్రి ధన్సింగ్ రావత్ పలువురు బీజేపీ నేతలతో కలిసి శనివారం పూజలు నిర్వహించారు. మంత్రి తీరుపై ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించడం కొవిడ్ నిబంధనలు, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. చార్ధామ్ యాత్రలోని ఈ ఆలయ తలుపులు తిరిగి తెరిచిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చార్ధామ్ యాత్రకు భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
ఈ క్రమంలో సామాన్య ప్రజలకు అనుమతి నిలిపివేయగా.. మంత్రి బద్రీనాథ్కు ఎలా వస్తారని అర్చకులు ప్రశ్నించారు. కుంభమేళలో పెద్ద ఎత్తున సాధువులు, జనం కొవిడ్ పాజిటివ్కు పరీక్షించిన విషయం తెలిసిందే. కుంభమేళాలో కరోనా నిబంధనలు అమలు చేయడంలో విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు భక్తులకు అనుమతి ఇవ్వలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.