కొనసాగుతున్న బాల్యవివాహాలు
గ్రామీణ ప్రాంతాల్లో కొరవడిన అవగాహన
బాల్యవివాహాలను అరికట్టడంలో ఐసీడీఎస్ పాత్ర కీలకం
మే లోనే పది, ఒకేరోజు మూడు పెండ్లిండ్లను అడ్డుకున్న అధికారుల
వనపర్తి, మే 23: బాల్యవివాహాలపై అవగాహన లేని తల్లిదండ్రులు చిన్నతనంలోనే తమ చిన్నారులకు వివాహాలు చేసి భారం దింపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సంబంధిత అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినా గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు చేస్తున్నారు. పెండ్లి అంటే తెలియని వయస్సులోనే తాళి కట్టించి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. మే 16న పెద్దమందడి, పాన్గల్, శ్రీరంగాపురం మండలంలో బాల్యవివాహాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు అక్కడికి చేరుకుని మూడు వివాహాలను అడ్డుకున్నారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ను ఇవ్వడంతోపాటు బాల్య వివాహాలు చేసినట్లయితే జరిగే అనార్థాలు, పడే శిక్షలను వివరించి పెండ్లిండ్లను నిలిపేశారు.
ఆడపిల్లలంటే భారమని..
సమాజం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రసార మాధ్యమాల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా చాలా మంది తల్లిదండ్రులు నేటికీ ఆడపిల్లలంటే భారంగానే భావిస్తున్నారు. చదువుకునే వయసులో జీవితంపై అవగాహన ఏర్పడకుండానే పెండ్లి చేసి వారి బాల్యాన్ని బందీ చేస్తున్నారు. పదో తరగతి తర్వాత పెండ్లి వద్దు.. పై చదువులు చదివించాలంటూ సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో అమ్మాయి చదువు ఆవనికి వెలుగు అంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నా.. కొంతమంది తల్లిదండ్రులలో మార్పు కనిపించకుండా చిన్న వయసులో పెండ్లి చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఐసీడీఎస్ పాత్ర కీలకం
బాల్యవివాహాలను అరికట్టడంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఐసీడీఎస్దే కీలకపాత్ర. 11 నుంచి 18సంవత్సరాలలోపు కిశోర బాలికల జాబితా అంగన్వాడీ టీచర్ల వద్ద ఉంటుంది. వీరు గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నట్లు గుర్తించి ముందుగానే ఉన్నతాధికారులతోపాటు పోలీసులకు సమాచారమివ్వాలి. ఈ విధంగా ఐసీడీఎస్ అధికారులు 2018లో (జనవరి నుంచి డిసెంబర్ వరకు) 15 బాల్యవివాహాలు, 2019సంవత్సరంలో 7, 2021లో జనవరి నుంచి మే వరకు 10 బాల్యవివాహాలు ఆపి వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు అమ్మాయిలను స్టేట్హోంకు తరలించారు.