సిద్దిపేట,మే21( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా రోగులు ఆధైర్య పడకండి ..ధైర్యంగా ఉండాలి.. మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది…మీకు ఎల్ల్లవేళలా అందుబాటులో ఉంటాం.. మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం అంటూ రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసానిస్తున్నారు. సిద్దిపేటలో కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, వైద్యాధికారులతో, మెదక్లో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్ ,వైద్యాధి కారులతో కలిసి మంత్రి హరీశ్రావు రెండు రోజుల్లో సిద్దిపేట, మెదక్ ప్రభుత్వ దవాఖానల్లోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలుకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్యం, ఇతర వివరాలను అడిగి తెలుసుకొని … త్వరలో మీరు కరోనాను జయిస్తారంటూ బాధితులకు ధైర్యం చెప్పారు.
ఇలా కరోనా రోగులకు అండగా తాము ఉన్నామంటూ భరోసానివ్వడమే కాకుండా ప్రతిరోజు ఫోన్లో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్రావు పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యాధికారులకు అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి నిమోజకవర్గాల్లో పర్యటిస్తూ కొవిడ్ వార్డులను సందర్శిస్తున్నారు. రోగులకు భరోసానిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ప్రజలంతా తమ ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం పక్కాగా చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం…
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆయా దవాఖానల్లో ఇప్పటికే సదుపాయాలు కల్పించింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దవాఖానలోని వార్డుల్లో సరిపడా ఆక్సిజన్, రెమ్డిసివర్, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉన్న పేషెంట్లను గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారు.ప్రతి ఒక పేషెంట్ లేదా ఇద్దరు పేషెంట్లకు ఒకరు చొప్పున స్టాఫ్ నర్సులు ఉంటూ కరోనా రోగి ఆరోగ్య పరిస్థితి కనిపెడుతున్నారు. కరోనా రోగులకు నిత్యం రూ.250 వెచ్చించి పౌష్టికాహారం మూడు పూటలా అందిస్తున్నారు.రోగులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జ్వర సర్వేతో సత్ఫలితాలు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాలనిచ్చింది. జ్వర సర్వేలో స్వల్ప లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారిని హోం ఐసొలేషన్లో ఉంచారు. వారికి కావాల్సిన మెడికల్ కిట్లు అందజేస్తున్నారు.దీనిలో ఎనిమిది రకాలు మందులు ఉంటున్నాయి. వ్యాధి లక్షణాలు ఉన్న బాధితులతో ఉదయం, సాయంత్రం అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు మాట్లాడుతూ వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు రోగుల ఆరోగ్యంపై వివరాలు తెలియజేస్తున్నారు. అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా కట్టడికి పక్కాగా చర్యలు…
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీధులను శుభ్రంగా ఉంచడంతో పాటు ఇంటింటికీ వెళ్లి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. పారిశుద్ధ్ధ్య కార్మికుల సంరక్షణపై అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో నిత్యం పనిచేసే కార్మికులకు, జవాన్లకు శానిటైజర్లు ఇచ్చి రోజుకు 3 సార్లు చేతులు శుభ్రంగా కడిగేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా కిరాణా షాపులు , మెడికల్ షాపులు, మార్కెట్లో కూరగాయలు, ప్రతి షాపు ముందు సున్నంతో ప్రత్యేకంగా డబ్బాలను గీసి పెడుతున్నారు.
స్వయంగా ఫోన్లో పలకరిస్తున్న మంత్రి …
హోం ఐసొలేషన్లో ఉన్న వారితో రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వయంగా ఫోన్లో మాట్లాడుతున్నారు. వారి యోగక్షేమా లు అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా కరోనా రోగుల వివరాలు తెలుసుకుంటున్నారు. మంత్రి హరీశ్ రావు సూచనతో కరోనా రోగులకు తమ వంతుగా సహాయం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధుల, టీఆర్ఎస్ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కావాల్సిన సహాయం చేస్తున్నారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి ఆహారం, మందులు అందిస్తున్నారు. గ్రామాలు, వార్డులు, పట్టణాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయా వార్డుల్లో బైక్లు, ఆటోల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నారు.