రంగారెడ్డి, మే 17, (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి సీజన్కుగాను వరి ధాన్యం సేకరణ జోరందుకున్నది. కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సత్వరమే చెల్లింపులు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే పౌరసరఫరాల శాఖ వద్ద సిద్ధంగా ఉంచింది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలించి బిల్లులు చేసే విధంగా సంబంధిత అధికారులు చొరవ తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 300లకుపైగా గ్రామాల్లో ధాన్యాన్ని పండించగా ఇప్పటివరకు 80 గ్రామాల్లో 90 శాతం మేర ధాన్యం సేకరణ పూర్తయినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
రూ.9.45 కోట్ల విలువైన ధాన్యం సేకరణ…
ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా, దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 17 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రారంభంకాగా,
ఇంకా 12 కొనుగోలు కేంద్రాల్లో మరో ఒకట్రెండు రోజుల్లో ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రూ.9.45 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.1.70 కోట్లు ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా.. మిగతా రూ.7.88 కోట్ల చెల్లింపులను మరో ఒకట్రెండు రోజుల్లో జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 1069 మంది రైతుల నుంచి 5013 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులోని నుంచి 3896 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్మిల్లులకు చేరవేయగా, మిగతా 1117 మెట్రిక్ టన్నుల ధాన్యం త్వరలో తరలించనున్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఒకేరోజు రైతులందరూ రాకుండా కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయడంతోపాటు, సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.
రోజుకు 50 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఈ ప్రకారమే గ్రామాలవారీగా ఏఈవోలు ఇప్పటికే రైతులకు టోకెన్లు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 35,333 ఎకరాల్లో జిల్లా రైతాంగం వరి పంటను సాగు చేయగా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఏ ఒక్క రైతు కూడా తొందరపడకూడదని సూచిస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1888, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1868 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏ గ్రేడ్కు రూ.51లకు మద్దతు ధరను పెంచింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 14, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 8, ఏఎంసీ ఆధ్వర్యంలో 3, పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, ఇప్పటికీ 17 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ తడిసినట్లయితే ఆరబెట్టిన తరువాతే తీసుకురావాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
కొడంగల్, మే 17: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితి కారణంగా గతంలో జిల్లా పరిధిలో 35,958 ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురవడం.. చెరువులు, కుంటలు నిండడంతో రైతులు అధిక మొత్తంలో వరిసాగు చేపట్టారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు రెట్టింపుస్థాయి అంటే 71,088ఎకరాల్లో వరిని సాగు చేశారు. దీంతో లక్షా 18వేల 390 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. గ్రామాల్లో ఎటు చూసినా ధాన్యం కుప్ప లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రూ.10.75కోట్లు జమ..
జిల్లా పరిధిలో మొత్తం 163 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం 116 సెంటర్ల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,799 రైతుల నుంచి 16,856.980 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 2,422 మంది రైతులకు సంబంధించి రూ.10.75కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. 11,826 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్మిల్లులకు పంపించగా.. ఇంకా 4,700 మెట్రిక్ టన్నులు ఆయా కేంద్రా ల్లో నిల్వ ఉన్నది. 11లక్ష గన్నీ బ్యాగులు పంపిణీ చేయగా.. మరో 6లక్షల బ్యాగులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మార్కెట్కు వెళ్లే బాధ తప్పింది..
గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయం. దీంతో ధాన్యాన్ని మార్కెట్కు తీసుకెళ్లేందుకు కావాల్సిన వాహన ఖర్చు తప్పింది. సమయం కూడా ఆదా అవుతున్నది. వేరే చోటకు తీసుకెళ్లి విక్రయించాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఏటా గ్రామంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముతున్నాను. ఇప్పుడు కూడా ఊరులోనే అమ్ముతాను. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతున్నది. రైతుల కోసం ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. ఆయనకు రైతులంతా రుణపడి ఉంటారు.
-పెద్ద కాశప్ప, రైతు, బొంరాస్పేట
వారం రోజుల్లో నగదు జమ..
గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతున్నది. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుండడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా సరైన తూకం, మద్దతు ధరతో రైతులకు కొనుగోలు కేంద్రాలపై పూర్తి భరోసా ఏర్పడింది. అధిక మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వారికి ధాన్యం డబ్బులు కూడా సరైన సమయంలోనే అందుతున్నాయి
ధాన్యం కొనుగోలులో దేశానికే ఆదర్శం
కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నా రు. రైతులకు న్యాయం చేయాలని ముందుకు సాగుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందిస్తున్నారు. ప్రతి రైతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం సంతోషం. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా తొందరగా వారి ఖాతాల్లో పడుతున్నాయి
– వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్
ఒకట్రెండు రోజుల్లో చెల్లింపులు..
గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించిన వెంటనే రైస్మిల్లులకు చేరవేస్తున్నాం. కానీ కొందరు రైస్మిల్లర్లు ట్యాబ్ ఎంట్రీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లింపుల్లో కొంత జాప్యం జరుగుతున్నది. రైస్మిల్లర్లతో సమావేశమై ఒకట్రెండు రోజుల్లో చెల్లింపులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటాం. రైతులెవరూ ఆందోళన చెందవద్దు. చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరిస్తాం. రైతులు దళారులను నమ్మి ఇతరులకు విక్రయించవద్దు. స్థానికంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి.
-శ్యామారాణి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, రంగారెడ్డి