భోపాల్: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అయినా నిత్యం ఎంతో మంది నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉల్లంఘనులకు పోలీసులు విధించే శిక్షలు వినూత్నంగా ఉంటున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఉల్లంఘనులతో పోలీసులు గుంజీలు తీయిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో కప్పగంతులు వేయిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా వినూత్న పద్ధతిలో ఉల్లంఘనులను శిక్షిస్తున్నది. నిబంధనలు లెక్కచేయకుండా అనవసరంగా బయటికి వచ్చిన వారితో అక్కడి పోలీసులు రామనామం రాయిస్తున్నారు. ఉల్లంఘనుల చేతికి ఒక డెయిరీ ఇచ్చి పేజీ నిండా రామ రామ అని రాయమంటున్నారు.