రెండోరోజూ పటిష్టంగా లాక్డౌన్
నగరమంతా కర్ఫ్యూ వాతావరణం
రహదారులు నిర్మానుష్యం
కొనసాగిన పోలీసుల తనిఖీలు
కరోనా నియంత్రణే ధ్యేయంగా సర్కారు చేపట్టిన లాక్డౌన్ నగరంలో విజయవంతంగా అమలవుతున్నది. రెండోరోజూ గురువారం వెలుసుబాటు కల్పించిన సమయంలో మినహా ప్రజలెవరూ రోడ్లపై తిరుగలేదు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వాణిజ్య, వ్యాపార సముదాయాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా నిత్యావసరాలు, అవసరమున్న వస్తు సామగ్రి, కూరగాయలు కొనుగోలు కోసం దుకాణాల వద్ద బారులు తీరారు. పలు ప్రాంతాల్లో జనం రద్దీగా కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని చెదరగొట్టారు. శుక్రవారం రంజాన్ కావడంతో బట్టల దుకాణాలు, జ్యువెల్లరీ షాపులు, డ్రైఫ్రూట్ సెంటర్లలో ముస్లింల సందడి కనిపించింది. అయితే, ఉదయం 10 గంటలు దాటగానే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు అన్ని చౌరస్తాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, బ్యాంకు, విద్యుత్ తదితర ఉద్యోగులు తమ ఐడీ కార్డులను చూపించి విధులకు హాజరయ్యారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి ప్రజలు రాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. కూడళ్ల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
నిరాటకంగా ఎమర్జెన్సీ విధులు..
అత్యవసర విధులకు హాజరవుతున్న సిబ్బందికి ఎలాంటి ఆటంకం కలుగలేదు. వీరికి పోలీసులు సైతం సహకరించారు. అయితే, ఐడీ కార్డులను చూపితేనే వెళ్లేందుకు అనుమతించారు. దవాఖానలు, మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలు, నీరు, విద్యుత్ సరఫరా సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులకు హాజరయ్యారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం నిర్ణీత సమయానికి హాస్పిటళ్లకు చేరుకొని రోగుల సేవలో నిమగ్నమయ్యారు. అలాగే వ్యవసాయ పనులన్నీ నిరాటకంగా కొనసాగాయి. వడ్లను తీసుకెళ్తున్న వాహనాలను వే బిల్లులు చూసి అనుమతించారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
మరోవైపు ప్రభుత్వం కరోనా కట్టడి కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. నగరంలోని 7 కేంద్రాల్లో ఉదయం 9 నుం చి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం రెండో డోస్ వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే వారికి పోలీసులు సడలింపులు ఇస్తున్నారు. అయితే ఫోన్లో వ్యాక్సిన్కు సం బంధించిన మెస్సేజ్ చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటు నగరంలో చేపడుతున్న ఇంటింటా జర్వ సర్వే వేగంగా సాగుతున్నది. ప్రతి డివిజన్లో రెండు బృందాలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నారు. అనుమానితులకు ఐసొలేషన్ కిట్లు అందించారు.