ఎల్బీనగర్, మే 13: లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపై, ప్రధాన కూడళ్లలో జనసంచారం ఉండదు.. ఈ సమయంలోనే పెండింగ్లో ఉన్న డ్రైన్స్, ట్రంక్లైన్స్, రోడ్లు, యూజీడీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో కలిసి అధికారులతో ఉదయం 7 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. విధులను హజరయ్యే సిబ్బందికి ప్రత్యేకంగా పాసులు అందజేస్తామన్నారు. ప్రస్తుత లాక్డౌన్ను అన్ని శాఖల వారు ఉపయోగించుకుని, తమ శాఖల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను లాక్డౌన్లోపు పూర్తి చేసేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నియోజకవర్గంలోని జ్వర సర్వే, శానిటేషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా మురికివాడలు, బస్తీలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి పారిశుధ్యం పనులు చేపట్టాలని సూచించారు. జ్వర పీడితులకు మెడికల్ కిట్లను అందించడంతో పాటుగా వారిపై పర్యవేక్షణ చేయాలని, ఉప కమిషనర్లు ఎప్పటికప్పుడు బస్తీ దవాఖానలు సందర్శించి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. తక్కువ సిబ్బంది ఉన్న బస్తీ దవాఖానాల్లో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. రోడ్లు, బస్తీల్లో చెత్త లేకుండా చూడాలని, ప్రధానంగా నందనవనం బస్తీని మోడల్ బస్తీగా తీర్చిదిద్దాలన్నారు. కామినేని ఫ్లై ఓవర్ కింద ఆక్సిజన్ పార్కు పనులను వేగంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు సురేందర్రెడ్డి, హరి కృష్ణయ్య, ఎస్ఇ అశోక్రెడ్డి, డీఈ శ్రీనివాస్, కనకయ్య, ఎంటమాలజీ విభాగం అధికారి రజినీ, మంజులవాణి పాల్గొన్నారు.