ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
జోగుళాంబ గద్వాల జిల్లాలో 4,639 కేసులు
గద్వాల న్యూటౌన్, మే 10 : కరోనా రెండో దశ విస్తరిస్తున్నా.. వైరస్ సోకితే ఏకంగా ప్రాణాలే పోతున్నా.. ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీసం మాస్కు ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జరిమానా విధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో 28రోజుల వ్యవధిలోనే 4,639 కేసులు నమోదు చేశారు. జరిమానా రూపంలో రూ. 46,39,000 చెల్లించాల్సి వచ్చింది. కరోనా మహమ్మరి తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రజల ఆరోగ్యంమే ధ్యేయంగా పలు నిబంధనలు తీసుకొచ్చింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం 51సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ఈ- చలానా రూపంలో జరిమానాలు విధిస్తున్నారు. మాస్కు ధరించని వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లంఘనులకు పోలీసులు ఈ చలానాలు జారీ చేస్తున్నారు.
28 రోజుల్లో..
మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి జరిమానా విధించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీస్శాఖతోపాటు మున్సిపల్, పంచాయతీ కార్యదర్శులు జరిమానా విధించే అధికారం కల్పించారు. జిల్లాలో 28 రోజుల్లో పోలీసులు 4,639కేసులు నమోదు చేశారు. మాస్కు ధరించని వారి ఫొటోలు తీస్తూ వారి ఆధార్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి సదరు వ్యక్తి ఫోన్ నంబర్కు ఉల్లంఘన వివరాలతో కూడిన లింక్ను పంపిస్తున్నారు. ఆ లింకు తెరిచి అందులోని వివరాల ఆధారంగా నెట్ బ్యాంకింగ్ లేదా మీ సేవలో జరిమానా చెల్లించాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ 1నుంచి 28వ తేదీ వరకు రూ. 46,39,000 జరిమానా విధించారు.
కొంటే రూ.20 లేదంటే రూ. వెయ్యి
సెకండ్ వేవ్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సగటున రోజుకు రెండు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కఠిన నిబంధలన నేథప్యంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాల్సిందే. లేకపోతే రూ. వెయ్యి జరిమానా చెల్లించాలి. రూ. 20మాస్కుతో పోయే దానికి రూ. వెయ్యి చెల్లించాల్సిందే. చాలా వరకు మాస్కులు ధరిస్తున్నా కొంతమంది మాత్రం లెక్క చేయడం లేదు.
జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్
కరోనా నేపథ్యంలో జిల్లా అంతటా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గద్వాల, ధరూర్, మల్దకల్, అయిజ, మానవపాడు, వడ్డేపల్లి, అలంపూర్ తదితర ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. ఇక పోలీసు ఉన్నధికారులతో పాటు సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ రంజన్ రతన్కుమార్ స్వయంగా తిరుగుతూ నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేయాలని సూచిస్తున్నారు.
భౌతికదూరం ఏదీ?
కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిస్తున్నా ప్రజలు నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. వైద్యారోగ్యశాఖధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అవగాహన కల్పిసున్నా వ్యాపారులు మాత్రం అధికారుల సూచనలు, సలహాలు పట్టించుకోవడం లేదు. కూరగాయల దుకాణాదారులు, కిరాణ దుకాణాలు, హోటల్స్, చికెన్ సెంటర్లు, వైన్స్ షాపులు, టీస్టాల్స్ వద్ద భౌతికదూరం పాటించకుండానే, కొందరు మాస్కులు సైతం ధరించకుండా నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. దీంతో కొవిడ్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.