చార్మినార్, మే 9: సాటివారికి అండగా నిలిచేందుకు మానవతావాదులు ముందుకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ బాధితుల ఇబ్బందులను చూసి చలించిన కుంభమేళా అగర్వాల్ బంధు, అశోక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో.. కొవిడ్తో రోగులకు ఉచితంగా ఆక్సిజన్ అందించడానికి ముందుకు వచ్చారు. బహదూర్పురలోని అశోక్ ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో సంస్థ అధ్యక్షులు పంకజ్ కుమార్ అగర్వాల్ బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. ఈ సందర్భంగా పంకజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక పడుతున్న ఇబ్బందులను గమనించి వారి సమస్యలను కొంత మేరకైనా పరిష్కరించేందుకు కృషి చేస్తూ, ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి ముందుకు వస్తున్నామని తెలిపారు. 79897 71272, 92465 50088 నంబర్లలో కొవిడ్ బాధితులు సంప్రదించి ఆక్సిజన్ సిలిండర్లను పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అశోక్ ఫౌండేషన్ సభ్యులు ప్రియాంక అగర్వాల్, తరుణ్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా బాధితులకు ఉచిత భోజనం
సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): కరోనా విపత్తులో సాయం చేసే వారు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఎవరి స్థాయిని బట్టి వారు వీలైనంత చేయూతనందిస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్పింగ్ స్పాట్ అనే సంస్థ ప్రతిరోజు 400 మంది ఆకలిని తీర్చుతున్నది. 8143143645కు ఫోన్ చేస్తే తాము కొవిడ్ రోగులకు ఇంటికి భోజనం పంపిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు భార్గవ్ తెలిపారు. అలాగే సంగ్వి (70320 05977), భావిక్ (88852 22221) అనే ఇద్దరు మిత్రులు ప్రతిరోజు 50 భోజనాలను సుమారు 25 కుటుంబాలకు అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.