హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తినే ఆహారంలో కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలంటున్నారు ఆహార నిపుణులు. మన వద్ద 90 శాతం మంది ప్రజలు కార్బొహైడ్రేడ్స్ ఉన్న ఆహారపదార్థాలను అధికంగా తీసుకుంటారని జాతీయ ఆహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో తేలింది. ఇప్పటికైనా అధిక మోతాదు కార్పొహైడ్రేట్స్కు స్వస్తి పలికి ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజు మనం తినే ఆహారంలో డైటరీ డైవర్సిటీ పాటించాలని, శరీరానికి అవసరమైన కనీస ఆహార పదార్థాలు ఉండేలా సూచుకోవాలని చెప్తున్నారు. పేద, మధ్య తరగతి, ధనిక అన్న తేడాలేకుండా ఉన్న బడ్జెట్లోనే ప్రణాళికతో మంచి ఆహారం తీసుకోవచ్చని చెప్తున్నారు. బాదం.. పిస్తా.. మటన్ లాంటివి అక్కరలేకుండానే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు తినవచ్చని తెలిపారు. ఆకు కూరలు, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవాలని వెల్లడించారు. తినే ఆహారం వీలైనంతవరకు వేడిగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు, ప్రతి రోజు కచ్చితంగా రెండు గుడ్లు తినడం మంచిదని, వీటితో పాటు విటమిన్ ఏ, సీ పండ్లను తినాలని వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచిది. అలా అని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు సహజంగా లభించే పప్పులు, ఆకు కూరలు, పాలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు మనం తినే ఆహారంలో 8 రకాలు ఉండేలా చూసుకోవాలి.
ఇప్పటి వరకు ఎలా తిన్నా, ఏం తినకపోయినా నడిచింది. కానీ ఇకపై అలా కాదు. మనం ఎంత మంచిగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎంత ఆరోగ్యంగా ఉంటే కరోనా మహమ్మారి నుంచి అంత రక్షణ పొందుతాం. అందుకే మనం తినే పళ్లెంలో కచ్చితంగా 8 రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. కార్బొహైడ్రేట్స్ను తగ్గించి అధికంగా ప్రొటీన్లు, విటమిన్లు గల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. భారీగా ఖర్చు చేసే అవసరం లేకుండానే దిగువ, మధ్యతరగతి కుటుంబాలూ మంచి ఆహారం తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.