లండన్ : భారత్లో కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఆదుకునేందుకు యూకే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం అంటోనోవ్ ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ నుంచి శుక్రవారం 18 టన్నుల మూడు ఆక్సిజన్ జనరేటర్లు, వెయ్యి వెంటిలేటర్లతో బయలుదేరిందని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. ప్రాణాలను రక్షించే కిట్లతో అంటోనోవ్-124 విమానం ఆదివారం ఢిల్లీకి చేరుకుంటుందని భావిస్తున్నారు. అనంతరం వాటిని రెడ్క్రాస్ హాస్పిటళ్లకు తరలించనున్నట్లు పేర్కొంది.
ఒక్క ఆక్సిజన్ తయారీ యూనిట్ నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుందని, ఒకేసారి 50 మందికి ఉపయోగించడానికి సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. మహమ్మారి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యూకే, భారత్ కలిసి పని చేస్తున్నాయని విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ చెప్పారు. ‘భారత్లో పరిస్థితి హృదయవిదారకరంగా ఉంది. పెద్ద సవాల్ను ఎదుర్కొంటున్నందున మేం మిత్రులతో కలిసి నిలబడుతాం’ అని యూకే ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ పేర్కొన్నారు.
గ్లోబల్ మహమ్మారిపై కలిసి జరుపుతున్న పోరాటంలో వెంటిలెటర్లు, ఆక్సిజన్ జనరేటర్లతో సహా తాము అందిస్తున్న కీలక పరికరాలు ప్రాణాలు కాపాడేందుకు భారత ఆరోగ్య సంరక్షణకు తోడ్పడుతాయన్నారు. యూకే నుంచి ఆరోగ్య అధికారులకు సహాయం చేయడానికి చేయగలిగినంద చేస్తామని చెప్పారు. భారత్లో ప్రాణవాయువు కొతరను తీర్చేందుకు తాము పంపిస్తున్న మూడు ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ఒక్కొక్కటి 500 లీటర్ల ఆక్సిజన్ను నిమిషంలోనే తయారు చేయగలవని ఉత్తర ఐర్లాండ్ ఆరోగ్య మంత్రి రాబిన్ స్వాన్ తెలిపారు.