కొనుగోలు కేంద్రాలకు వెల్లువెత్తిన ధాన్యం
ఏడాదికేడాది పెరుగుతున్న దిగుబడి
దిగుబడికి అనుగుణంగా కేంద్రాల ఏర్పాటు
సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
గంగాధర, మే 4 : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో మండలంలో వ్యవసాయాభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, 24 గంటల విద్యుత్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో చెరువులు నింపడంతో వ్యవసాయం దండుగ అన్న చోటే పండుగలా మారింది. ఏళ్లకేళ్లు బీళ్లుగా ఉన్న భూములు సాగుకు నోచుకున్నాయి. ఉమ్మడి పాలనలో గంగాధర మండలం కరువుతో అల్లాడింది. ఏడాదికి రెండు పంటలు దేవుడెరుగు.. వానకాలం వేసిన పంటకు సైతం సాగు నీరు అందక కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచక అన్నదాతలు ఆక్రందన చేసిన ప్రాంతం. 2014లో స్వ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏడాదికేడాది ధాన్యం దిగుబడి పెరుగుతుండడంతో అన్నదాత కళ్లల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
పెరిగిన ధాన్యం దిగుబడి
ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో ఏడాదికేడాది ధాన్యం దిగుబడి పెరుగుతూ వస్తున్నది. మండలంలో గంగాధర పీఏసీఎస్ ఆధ్వర్యంలో 11, కురిక్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 9 , ఐకేపీ ఆధ్వర్యంలో 11, గంగాధర మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వానకాలం సీజన్లో గంగాధర పీఏసీఎస్ ఆధ్వర్యంలో 69,312 క్వింటాళ్లు, కురిక్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 39 వేల క్వింటాళ్లు, ఐకేపీ ఆధ్వర్యంలో లక్షా 75 వేల క్విటాళ్లు, గంగాధర మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 14,127 కొనుగోలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరుగడంతో మరింత ఎక్కువ మొత్తంలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బీడు భూములు సాగులోకి వచ్చాయి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో పాటు చెరువులు నింపడంతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. ఏడాదికేడాది సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గతంలో వేసిన పంటలకు సాగు నీరందక కొద్దిగా సాగు చేసి మిగిలింది బీడుగా వదిలేసేవాడిని. మా ఊరి పక్క నుంచి వెళ్తున్న వరదకాలువలో నీళ్లు నిండుగా ఉండడంతో మొత్తం పొలం సాగు చేశాను. గత ఏడాది కన్నా ఈసారి దిగుబడి ఎక్కువగా వచ్చింది.
-రేండ్ల శ్రీనివాస్, కొండన్నపల్లి