చెన్నై : ఆ పార్టీ అంటే అభిమానం.. ఆ నాయకుడు అంటే ఎనలేని ప్రేమ. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయ ఢంకా మోగించింది.. ఆ పార్టీ అధినాయకుడు సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నాడు.. అలా అన్ని చకచకా జరిగిపోతుంటే.. ఆ అభిమాని అమితానందంతో సంబురపడిపోయింది. ఆ పార్టీ, ఆ నాయకుడిపై ఉన్న అభిమానంతో ఆమె ఏకంగా నాలుక కోసుకుని మొక్కు తీర్చుకుంది.
తమిళనాడుకు చెందిన వనిత(32) అనే మహిళకు డీఎంకే పార్టీ అంటే గౌరవం. స్టాలిన్ నాయకత్వమంటే ఆమెకు భలే ఇష్టం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారాన్ని చేపట్టబోతోంది. దీంతో వనిత తన మొక్కును తీర్చుకుంది. దేవుడికి ఏ పూలదండనో, నైవేద్యం పెట్టి మొక్కు తీర్చుకోలేదు ఆమె. స్థానికంగా ఉన్న ముత్తాలమ్మన్ ఆలయం వద్ద ఇవాళ ఉదయం.. ఏకంగా తన నాలుకను కోసుకుని మొక్కు సమర్పించి, స్టాలిన్ పట్ల ఉన్న అభిమానాన్ని చూపించింది. కానీ ఆమె ఆస్పత్రి పాలైంది. ప్రస్తుతం వనిత చికిత్స పొందుతోంది.