బయోపిక్ చిత్రాల్ని ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిగణిస్తారు. స్ఫూర్తివంతమైన వ్యక్తుల జీవిత ప్రయాణానికి దృశ్యరూపంగా భావించే ఈ సినిమాలు ప్రస్తుతం అన్ని భాషల్లో విరివిగా తెరకెక్కుతున్నాయి. ఈ కోవలోనే తెలుగులో కూడా వరుస మహిళా ప్రధాన బయోపిక్లకు రంగం సిద్ధమవుతోంది. వీటిలో నటించబోయే కథానాయికలెవరన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.
ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో దేశానికి పతాకాన్ని అందించిన తెలుగు క్రీడాకారిణి కరణం మల్లీశ్వరీ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నది. విశ్వక్రీడల్లో పతాకాన్ని సాధించడం కోసం మల్లీశ్వరీ సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఆధారంగా రచయిత కోన వెంకట్ ఓ సినిమాను రూపొందించబోతున్నారు. సంజనారెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కరణం మల్లీశ్వరీ పాత్రకు సరిపోయే నాయిక కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తోంది. వెయిట్లిఫ్టర్ పాత్రలో రకుల్ప్రీత్సింగ్ కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ఈ సినిమాలో నటించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రకుల్ప్రీత్సింగ్తో పాటు అంజలి, నిత్యామీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎంవీవీ సత్యనారాయణతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తారు.
నాగరత్నమ్మగా ఎవరు?
కర్ణాటక సంగీతకారిణి, మహిళా హక్కుల కోసం పోరాడిన తొలితరం నాయకురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవితం సినిమాగా రాబోతున్నది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిర్దేశకత్వంలో పాన్ ఇండియన్ స్థాయిలో బహుభాషా చిత్రంగా ఈ బయోపిక్ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాగరత్నమ్మ పాత్ర కోసం అగ్ర కథానాయికలు అనుష్క, సమంతలలో ఒకరిని తీసుకోవాలనే యోచనలో సింగీతం శ్రీనివాసరావు ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. ఇప్పటివరకు నాయికల ఎంపికపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వీరితో పాటు దీపికా పడుకోన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
సౌందర్య బయోపిక్లో..
దివంగత నటి సౌందర్య బయోపిక్ తెలుగు తెరపై రాబోతున్నట్ల్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సౌందర్య సినీ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ బయోపిక్లో సౌందర్య పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం.
ఉమాప్రేమన్ పాత్రలో నయన్?
సామాజిక కార్యకర్త ఉమాప్రేమన్ జీవితం ఆధారంగా తమిళ దర్శకుడు ట్రాఫిక్ రామస్వామి ఓ సినిమా చేయబోతున్నారు. తొలి కిడ్నీ దాతగా పేరొందిన ఉమా ప్రేమన్ పాత్రలో నయనతార, కీర్తిసురేష్లలో ఒకరు నటించబోతున్నట్లు సమాచారం. బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారిణి పీవీ సింధు జీవితం ఆధారంగా ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సోనూసూద్ తెలిపారు. పీవీ సింధు పాత్రలో బాలీవుడ్ అగ్ర నటి దీపికా పడుకోన్ నటించనున్నట్లు తెలిసింది. అలనాటి శృంగార తార సిల్క్స్మిత జీవితంతోఓ సినిమాను తెరకెక్కించేందుకు తమిళ దర్శకుడు మణికందన్ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో అనసూయ టైటిల్ పాత్రలో నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వీటిని అనసూయ ఖండించింది. సిల్క్స్మిత పాత్రలో తాను నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ పాత్రను ఎవరూ చేస్తారో వేచిచూడాల్సిందే.