జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలు
విలువ రూ.18,750 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి మరి. వీటి విలువ రూ.18,750 కోట్లు (2.5 బిలియన్ డాలర్లపైనే). దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన ఐపీవోల సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ 9వ స్థానంలో ఉన్నది. బుధవారం విడుదలైన ఈవై ఇండియా ఐపీవో నివేదిక ప్రకారం కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, రిటైల్, బహుళార్ధ పారిశ్రామికోత్పత్తులు, ఆటోమోటివ్, ట్రాన్స్పోర్టేషన్ రంగాలకు చెందిన సంస్థలు స్టాక్ మార్కెట్లలోకి అధికంగా వచ్చినట్లు తేలింది. 5 చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లూ పబ్లిక్ ఇష్యూకు రావడం విశేషం. కాగా, వీటిలో భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్ప్ ఐపీవో అతిపెద్దది. ఈ ఇష్యూ విలువ రూ.4,740 కోట్లు. ఈ ఏప్రిల్-జూన్లోనూ ఐపీవోలు భారీగానే వస్తాయన్న అంచనాను ఈవై వ్యక్తం చేసింది.
దండిగా ఎఫ్పీఐలు
భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐ) పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎఫ్పీఐల పెట్టుబడులు 105 బిలియన్ డాలర్లు పెరిగి 555 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశీయ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల విలువ 203 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తెలిపింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ఈ నెలలోనూ ఎఫ్పీఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం గమనార్హం.
రియల్టీ ఆకర్షణీయం
దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎఫ్పీఐలు.. తొలుత రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. ఆ తర్వాత ఫైనాన్షియల్, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, ఈ ఏడాది మొదలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నా.. అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈలు మదుపరులకు లాభాలనే అందించాయి. ఇది విదేశీ మదుపరుల పెట్టుబడుల రాకకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది.