న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షల అమలు దిశగా అడుగులేస్తున్నది. ఢిల్లీలోని దవాఖానలన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. పరిస్థితులిలాగే కొనసాగి.. దవాఖానలపై ఒత్తిడి పెరిగితే లాక్డౌన్ విధించక తప్పదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
లాక్డౌన్ అమలు చేయడం మినహా తమ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమేమీ లేదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. దేశ రాజధానిలో కరోనా వైరస్ నాలుగో వేవ్ ఉద్ధృతి ప్రమాదకరంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ పనులకు తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
‘గత విజృంభణ కంటే కరోనా నాలుగో ఉద్ధృతి అత్యంత ప్రమాదకరంగా ఉంది. వైరస్ విస్తృతిపై పరిస్థితిని సర్కార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం దేశ రాజధానిలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలనుకోవడం లేదన్నారు. ఒకవేళ దవాఖానలపై ఒత్తిడి పెరిగి.. పరిస్థితి దిగజారితే మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదని తెలిపారు.
ఢిల్లీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రైవేట్ దవాఖానల్లో పడకల కొరత ఏర్పడుతున్నది. దీంతో రోగులు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు.
ముందుజాగ్రత్త చర్యగా ఎంబీబీఎస్ మూడు, నాలుగో ఏడాది చదివే విద్యార్థులు, హౌస్ సర్జన్ చేస్తున్న వారితో పాటు బీడీఎస్ వైద్యుల సేవలు కూడా వినియోగించుకోవాలని అన్ని కొవిడ్ ఆసుపత్రుల అధికారులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాలిచ్చారు.
గత రెండు వారాలుగా ఢిల్లీలో కరోనా వైరస్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రోజువారిగా నమోదవుతున్న కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ప్రస్తుతం అక్కడ 28వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. దీంతో నగరంలో మరిన్ని కొవిడ్ ఆంక్షలను విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
ముఖ్యంగా సామాజిక, రాజకీయ, క్రీడలు, సినిమా, మతపరమైన సమావేశాలు, వేడుకలపై కేజ్రీవాల్ సర్కార్ నిషేధం విధించింది. ఇక తదుపరి ఆదేశాలిచ్చే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేసి ఉంచాలని రెండు రోజుల క్రితమే ఆదేశించింది.
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన