స్వామి, అమ్మవార్లకు వాహనసేవలు
ప్రత్యేక అలంకారాలు
తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు సర్వ దర్శనాలు
భక్తాదులకు సకలం సిద్ధం: ఈవో
శ్రీశైలం, ఏప్రిల్ 9: శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము 3గంటల నుంచి శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల అలంకార దర్శనాలు ప్రారంభమై మధ్యాహ్నం ప్రదోశకాల సమయం మినహా అర్థరాత్రి 12గంటల వరకు భక్తులను అనుతిస్తున్నట్లు చెప్పారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణోత్సవం, ఏకాంతసేవ మినహా నిత్యం నిర్వహించే ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష, హోమం, అభిషేక సేవలు నిలిపివేశారు. వివిధ రాష్ర్టాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకుంటుండటంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయా భాషల్లో విస్తృత ప్రచారాన్ని చేస్తున్నారు. అదేవిధంగా యాత్రికులు సేద తీరేందుకు చలువ పందిళ్లు, పార్కింగ్, శానిటేషన్, సూచిక బోర్డులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంచినీటి సరఫరా, వైద్యసేవలు, అన్నప్రసాద వితరణ శిబిరాల వద్ద వసతులు కల్పించినట్లు ఈఈ మురళీబాలకృష్ణ తెలిపారు.
నేడు భృంగివాహనంపై స్వామివారు
ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఉదయం ప్రత్యేక పూజలనంతరం అలంకార మండపంలో భృంగి వాహనంపై ఆసీనులైన ఆదిదంపతులకు షోడశోపచార క్రతువులు నిర్వహిస్తారు. అనంతరం గ్రామోత్సవంలో మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
పాదయాత్రగా శ్రీగిరి చేరుకుంటున్న భక్తులు
వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వస్తున్న భక్తులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా శివనామస్మరణ చేస్తూ పాదయాత్రలు చేసుకుంటూ స్వామి, అమ్మవార్ల దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
దాతల సేవలు హర్షణీయం
శివ భక్తులకు అన్నప్రసాద వితరణతోపాటు పండ్లు, ఫేస్మాస్కులను ఉచితంగా పంపిణీ చేసేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సేవా సంఘాలు, దాతల సేవలు హర్షణీయమని ఈవో కేఎస్ రామారావు అన్నారు.
కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి శుక్రవారం ఉదయం కుంభోత్సవ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా కుంభహారతి, సాత్వికబలిగా పసుపు, కుంకుమతో కూడిన కొబ్బరికాయలతో ఆలయ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిత్యాన్నదాన పథకానికి లక్ష విరాళం
శ్రీశైల దేవస్థ్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విశాఖపట్టణానికి చెందిన రాజేశ్వరరావు రూ.1,01,116 చెక్కును విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆలయ పర్యవేక్షకురాలు సాయికుమారికి విరాళాన్ని చెక్కురూపంలో అందించారు.
శ్రీశైల భ్రామరికి ఊయల సేవ
భ్రమరాంబికా అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఊయలసేవ నిర్వహించారు. గ్రామదేవత అంకాలమ్మకు శాస్ర్తోక్తంగా అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుడి వైపున కత్తి, సర్పం చుట్టబడిన ఢమరుకం, ఎడమ వైపున పానపాత్ర, త్రిశూలంతో దర్శనమిచ్చే అంకాలమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.