లక్నో : భార్యతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడనే ఆగ్రహంతో వరుసకు సోదరుడిని హత్య చేసిన వ్యక్తి ఉదంతం యూపీలోని మీరట్ జిల్లా కంకెర్ ఖేరా ప్రాంతంలో వెలుగుచూసింది. రైల్వే కాలనీలోని పాడుపడిన క్వార్టర్లో బాధితుడి మృతదేహం పడిఉండటంతో పోలీసుల దర్యాప్తులో ఈ వివరాలు వెలుగుచూశాయి. బాధితుడి ఫోన్ కాల్స్ రికార్డు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అషూగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్పురి ప్రాంతానికి చెందిన బాధితుడు భీమ్ లోథి (22) బీర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు.
వరుసకు సోదరుడయ్యే అషు భార్యతో లోథి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏప్రిల్ 5న తన భార్య, లోథి సన్నిహితంగా ఉన్న ఫోటోలు అషు కంటపడటంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భార్యతో అక్రమ సంబంధం నెరపుతున్న లోథిని మట్టుబెట్టాలని అషు నిర్ణయించుకున్నాడు. అదేరోజు లోథిని డ్రగ్స్ తీసుకుందామని చెప్పి అషు బయటకుతీసుకు వెళ్లాడు. పాడు బడిన రైల్వే క్వార్టర్కు తీసుకునివెళ్లి అక్కడే పదునైన ఆయుధంతో దాడి చేశాడు. లోథి తలపైనా అషు ఇటుకతో కొట్టాడని, బాధితుడి గొంతు కోసిన గుర్తులున్నాయని పోలీసులు చెప్పారు.