బీజాపూర్: తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ నేత హిద్మా, జోనాగుడ ప్రాంతంలో ఉన్నట్లుగా సెక్యూరిటీ నిఘా వర్గాలకు తప్పుడు సమాచారం చేరవేసి భద్రతా దళాలను మావోయిస్టులు ట్రాప్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని సుక్మా సరిహద్దులో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో అధిక సంఖ్యలో జవాన్లు మరణించడానికి ఈ ట్రాప్ కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
మావోయిస్ట్ నేత హిద్మా కదలికల గురించి నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన ఎలైట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) యూనిట్, జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)కు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. అయితే అప్పటికే తుపాకులతో భారీ సంఖ్యలో మాటువేసిన మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. మావోయిస్టులు చాలా దగ్గర నుంచి కాల్పులు జరుపడంతో జవాన్లకు ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ దాడిలో మావోయిస్టులు ఎలాంటి పేలుడు పదార్థాలు వినియోగించలేదు. కేవలం తుపాకులతోనే జవాన్లతో తలపడ్డారు. దీంతో మావోయిస్టులు పక్కా ప్లాన్తోనే మాటు వేసి దాడి చేశారని అధికార వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ పోరాటానికి మావోయిస్టులు సిద్ధమైనట్లు తెలుస్తున్నదని, దీని కోసం కొత్త క్యాడర్కు శిక్షణ ఇచ్చినట్లుగాను అంచనా వేస్తున్నారు.
మరోవైపు జవాన్లు పెద్ద సంఖ్యలో మరణించడానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణమని అధికారులు భావిస్తున్నారు. మూడు గంటలకుపైగా ఎదురుకాల్పులు జరిగాయని, జవాన్లు తమ బరువును తగ్గించుకునేందుకు ఆహారం, నీటిని వదిలిపెట్టారని, దీంతో ఎండకు, డీహైడ్రేషన్కు తాళలేక పలువురు జవాన్లు చనిపోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.