వెండి కాసుల కోసం జీసస్కు జూడాస్ ద్రోహం
బంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్ వంచన
గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్పై విజయన్ సర్కార్ మీద ప్రధాని మోదీ విమర్శలు
పాలక్కడ్/ధర్మపురం, మార్చి 30: కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శనాస్ర్తాలు సంధించారు. కాసిన్ని వెండి కాసుల కోసం జీసస్కు జూడాస్ ద్రోహం చేసినట్టే.. కాసింత బంగారం కోసం పినరయి విజయన్ ప్రభుత్వం కేరళ ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన బంగారం స్మగ్లింగ్ స్కామ్ను పరోక్షంగా ప్రస్తావించారు. ప్రతిపక్ష యూడీఎఫ్ అవినీతిని కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సూర్య కిరణాలను సైతం వదల్లేదని పరోక్షంగా సోలార్ ప్యానెల్ స్కామ్ను ప్రస్తావించారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ బరిలోకి దిగిన పాలక్కడ్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై వామపక్ష ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రధాని తప్పుబట్టారు. అమాయక భక్తులపై లాఠీచార్జీ చేయడంపై ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు రాష్ట్ర సంస్కృతిని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయ హింసకు అనేక మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హింసా సంస్కృతికి చరమగీతం పాడుతామని హామీ ఇచ్చారు.
నారాయణస్వామి ప్రభుత్వం ఘోరంగా విఫలం
పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని, కేవలం దోపిడీ మాత్రమే సాగిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను ఎన్నో ఎన్నికలు చూశానని, ఈ ఎన్నికలు మాత్రం ప్రత్యేకమని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా విధేయుడిగా ఉన్నా, నాయకుడిని (రాహుల్ని) మెప్పించేందుకు తప్పుగా అనువాదం చేసినా ఒక సిట్టింగ్ సీఎంకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని, దీన్ని బట్టి నారాయణస్వామి ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చన్నారు.
మహిళలకు కాంగ్రెస్-డీఎంకే వ్యతిరేకం
మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాను ‘కాలంచెల్లిన 2జీ క్షిపణి’గా మోదీ అభివర్ణించారు. తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిని అవమానపర్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలను దుయ్యబట్టారు. మహిళలను అవమానించడమే కాంగ్రెస్-డీఎంకే సంస్కృతి అని విమర్శించారు. వారు అధికారంలోకి వస్తే మహిళలను అవమానిస్తారని పేర్కొన్నారు. 1989లో శాసనసభలోనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను డీఎంకే నేతలు అవమానించిన విషయాన్ని గుర్తుచేశారు. మంగళవారం ధర్మపురంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏది అభివృద్ధి ఎజెండా కాగా, యూపీఏది వారసత్వ ఎజెండా అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్