తెలంగాణ: హాంగ్జూ వేదికగా 2022 లో జరుగనున్న ఆసియా క్రీడలకు ఇప్పటి నుంచే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నట్లు భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ ఠాకూర్ వెల్లడించాడు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పోటీలను పరిశీలించి ప్రతిభ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నాడు. సెలెక్టర్ హోదాలో సూర్యాపేట వేదికగా జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ను పర్యవేక్షించేందుకు విచ్చేసిన అజయ్.. ఈ సందర్భంగా మెగాటోర్నీ ఏర్పాట్లను అభినందించాడు. ఈ సందర్భంగా అజయ్ ఠాకూర్ చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే.. కబడ్డీకి భవిష్యత్ లేదన్నది అవాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లో మట్టి ఆటను దృష్టిలో పెట్టుకొని క్లబ్లు ఏర్పాటు చేస్తే మరింత మంది తెరపైకి వస్తారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రోత్సాహం లభిస్తే దేశం అద్భుతమైన క్రీడాకారులను సృష్టిస్తుంది.
క్రికెట్తో పోల్చకూడదు..
ఏ ఆటకుండే అభిమానులు దానికి ఉంటారు. ప్రతిదాన్ని క్రికెట్తో పోల్చి చూడకూడదు. కబడ్డీలో ఇప్పటి వరకు మూడుసార్లు ప్రపంచకప్ జరుగగా.. మూడింట్లోనూ భారతే ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ప్రస్తుతం క్రీడాకారులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నది. నేను కూడా స్పోర్ట్స్ కోటా కిందే డీఎస్పీగా ఎంపికయ్యా.
మా నాన్న నన్ను మంచి రెజ్లర్గా చూడాలనుకున్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ప్రాణం. అందుకే రెజ్లింగ్ను పక్కనపెట్టి కబడ్డీ వైపు అడుగులు వేశా. కఠోర శిక్షణతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నా. నా సారథ్యంలో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు మా నాన్న కల సాకారం అయిందనే సంతృప్తి కలిగింది.