దారి చెప్పిన సంగతులు
ప్రతి ప్రయాణం ఓ అనుభవాన్ని నేర్పుతుంది. దారిలో మాయదారి సమస్యలు ఎదురవుతాయి. జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాలూ తారసపడతాయి. తొవ్వ వెంట ఎదురైన ప్రతి సందర్భమూ బాటసారికి ఏదో ఒక పాఠం చెబుతుంది. ఏదో ఒక నిజాన్ని తెలియపరుస్తుంది. కొన్ని వాస్తవాలు ప్రయాణ దిశను మార్చేయవచ్చు. కొన్ని అసత్యాలు గమ్యాన్ని మరచిపోయేలా చేయవచ్చు. వేటికీ వెరవక సాగిపోవడమే స్థితప్రజ్ఞుడి కర్తవ్యం. ఇలాంటి వాళ్లు దారి పొడవునా ఎదురైన సంఘటనలన్నీ అనుభవాలుగా ప్రోది చేసుకొని సమాజానికి నిజానిజాలు తెలియజేస్తారు. రచయిత జయధీర్ తిరుమలరావు ‘తొవ్వ ముచ్చట్లు’ ప్రయత్నమూ ఇలాంటిదే. తను నడిచే తొవ్వలో ఎదురైన విషయాలు, మనసు తవ్వకాల్లో బయటపడిన సత్యాలు, కండ్లు చూసిన సంఘటనలు, చెవులు విన్న విశేషాలు, మస్తిష్కాన్ని తొలచిన ఆలోచనలు.. వీటన్నిటినీ వ్యాసాలుగా ఈ సంకలనంలో పొందుపరిచారు. ఆయన అనుభవసారాల్లో ఇది ఐదో భాగం. తొలినాటి తెలుగు ముచ్చట్లు మొదలు సమకాలీన రాజకీయాల ప్రస్తావనల వరకు ఎన్నెన్నో సంగతులను పంచుకున్నారు. ఈ భాగంలో 48 ముచ్చట్లున్నాయి. ప్రతిదీ ఏదో ఓ కొత్త విషయాన్ని చెబుతుంది. ఎంతోకొంత సరికొత్త ఆలోచన కలిగిస్తుంది.
కొస‘మెరుపుల్’
కథకు వస్తువు ప్రధానం. ఆపై కథనం. ఈ రెండిటిలో ఏది లోపించినా ఇతివృత్తం నిస్సారమవుతుంది. రెండూ సమపాళ్లలో కుదిరితే అంతకన్నా కావాల్సిందేముంటుంది? కథకు ఊహకందని కొసమెరుపు తోడైతే చదువరుల పంట పండినట్టే! అలాంటి మేలి మలుపులతో కథాసాగు చేశారు రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం. 18 అందమైన కథలూ అనూహ్యమైన మలుపులున్నవే. చదివేవారి బుర్రకు ైక్లెమాక్సు తట్టదు. కొసమెరుపు అర్థమయ్యాక హాయిగా నవ్వుకోవడం, గట్టిగా ఊపిరి వదలడం, తృప్తిగా పేజీ తిప్పేయడం చకచకా జరిగిపోతాయి. ‘కొసమెరుపు కథలు’ చదువుతుంటే ఒక్కో కథ మన పక్కనే జరుగుతున్న యథార్థ సంఘటనలా అనిపిస్తుంది. కథల్లోని పాత్రలన్నీ మన చుట్టూ తిరుగుతున్నాయనిపిస్తుంది. సెల్యులాయిడ్ స్క్రీన్ మీద ఏదో దృశ్యం చూస్తున్న అనుభూతి కలుగుతుంది. గుణనిధి ‘స్వాగత భవనం’ చూపే సస్పెన్సూ, ఓ సొగసరి చేసే న్యూసెన్సూ, కేశవులు చేసే నాన్సెన్సూ.. ఇలా ప్రతి కథా గుర్తుండిపోయేదే! ప్రతీ కథనం మనసుకు హత్తుకునేదే. రచనా శైలిలో రచయిత అనుభవం కనిపిస్తుంది. కథలు రాసే ప్రయత్నంలో ఉన్నవారికి ‘కొసమెరుపు కథలు’ ఓ దిక్సూచి.
ఉన్నది.. ఉన్నట్లే!
రామోజీరావు పట్టిందల్లా బంగారం కాలేదు. ఆయన ఆచితూచి బంగారాన్నే పట్టుకున్నారు. ఆ నిధి నిక్షేపాలు పత్రిక రూపంలో ఉండవచ్చు, పచ్చళ్ల రూపంలోనూ ఉండవచ్చు. ‘రోడ్డు మీద వంద రూపాయల నోటు కనిపిస్తే రామోజీ రావు తీసుకుంటారా?’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు ‘అస్సలు తీసుకోరు. అది నేరం అవుతుంది. కాకపోతే, దాన్ని ఎవరైనా తీసుకుంటే మాత్రం, వాళ్ల దగ్గర నుంచి తానెలా సొంతం చేసుకోగలనా అని ఆలోచిస్తారు. అప్పుడది వ్యాపారం అవుతుంది’ అని చమత్కారంగా జవాబిచ్చారు భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ ఓ సందర్భంలో. ఈ పుస్తక సారాంశమూ దాదాపుగా అలాంటిదే. ఆ పత్రికాధినేత గురించి విన్నదీ, కన్నదీ గుదిగుచ్చి ‘రామోజీరావు ఉన్నది ఉన్నట్టు’ అనే శీర్షికతో పాఠకుల ముందుకు తెచ్చారు పాత్రికేయులు గోవిందరాజు చక్రధర్. భాష మీద ప్రేమ అయినా, అక్షరం మీద మమకారమైనా ఆయనకు వ్యాపారం తర్వాతే, వ్యాపారానికి ముడిసరుకుగా పనికొస్తేనే! మార్కెట్ లేదన్న విషయం అర్థమైపోయిన మరుక్షణం.. ప్రాథమ్యాలు మారిపోతాయని చెప్పేందుకు చాలా ఉదాహరణలే సేకరించారు రచయిత. ఒకనాటి సహచరులు, సమకాలికులు, సలహాదారులు, సిబ్బంది మాటల్లో రామోజీ వ్యక్తిత్వ చిత్రణకు ప్రయత్నించారు. తమ మాజీ చైర్మన్ మంచివారని చెప్పినవారు ఉన్నారు, చెడ్డవారని విరుచుకుపడ్డవారూ ఉన్నారు. కానీ, ఆయనలోని దీర్ఘదర్శినీ, సామ్రాజ్య నిర్మాతనూ వేలెత్తిచూపినవారు దాదాపుగా లేరు.