న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ర్టాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,871 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 102 రోజుల్లో ఇదే అత్యధికం. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నాందేడ్ జిల్లాలో ఈ నెల 31 వరకు అన్ని ప్రార్థన స్థలాలు, మందిరాలను మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో ఒక్కరోజే 2,877 కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆ రాష్ర్టానికి బస్సుల రాకపోకలను మధ్యప్రదేశ్ నిలిపివేసింది. మరోవైపు, కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లో శుక్రవారం నుంచి పాఠశాలలను మూసివేస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అన్ని నగరాల్లో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని మరో గంట పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఇంకోవైపు, పంజాబ్లోని ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగిస్తున్నట్టు ఆ ప్రభుత్వం వెల్లడించింది.