ముంబై: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై శివసేన పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రయివేటీకరణ విషయమై కేంద్ర మంత్రుల కబుర్లకు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు పొంతనే లేదని పేర్కొంది. మోదీ సర్కార్ అమలు చేస్తున్న విధానాలు, చెబుతున్న కబుర్లకు పొంతనే లేనప్పుడు వారి హామీలను నమ్మేదెలా? అని నిలదీసింది.
‘రైల్వే దేశ ప్రజల ఆస్తి.. దాన్ని ఎన్నటికీ ప్రైవేటీకరించబోం అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్లో చెప్పారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణా ఉండదని మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ భరోసా ఇచ్చారు. కానీ, తాజా పరిమాణాలు వారి హామీలకు అనుగుణంగా కనిపించడం లేదు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేస్తున్న అమలు చేస్తున్న విధానాలు, కేంద్ర మంత్రులు చెబుతున్న మాటలకు పూర్తి విరుద్ధం. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలే కాదు జాతీయ బ్యాంకులను సైతం ప్రైవేటీకరించడం మొదలెట్టారు’ అని శివసేన అధికార పత్రిక సామ్నా మండి పడింది.
‘పెట్టుబడిదారుల చెమటతో ప్రజల ఆస్తులు నిర్మించలేదు. కానీ మోదీ సర్కార్ మాత్రం వాటిని కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టింది. మంత్రులు ఎంత సీరియస్గా భరోసా కల్పిస్తున్నా రైల్వే, బీమా సంస్థలపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉంది. ప్రభుత్వం తన విధుల్ని సరిగా నిర్వర్తించలేనపుడు ప్రభుత్వాన్ని నడపడం ఎందుకు? బడ్జెట్ పెట్టడం ఎందుకు?’ అని శివసేన ఘాటుగా ప్రశ్నించింది.