బీజింగ్, మార్చి 16: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాకు ఆ దేశంలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి మధ్య వైరం మరింత ముదురుతున్నది. చైనా మీడియా సంస్థల్లో అలీబాబాకు ఉన్న వాటాలను అమ్మాలని జాక్ మాపై జిన్పింగ్ సర్కార్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. అలీబాబా సంస్థ అధినేతగానే కాకుండా హాంకాంగ్ నుంచి వెలువడుతున్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’కు యజమానిగా వ్యవహరిస్తున్న జాక్ మాపై చైనా ప్రభుత్వం గత ఏడాది నుంచి అణచివేత ధోరణి కొనసాగిస్తున్నది. దీనిలో భాగంగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, సోషల్ మీడియా సైట్ ’వెయిబో’, ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్ ‘బిలిబిలి’తోపాటు చైనాకు చెందిన ఇతర మీడియా, అడ్వైర్టెజింగ్ సంస్థల్లో అలీబాబాకు గల వాటాలను అమ్మాలని జాక్ మాపై జిన్పింగ్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రిక వెల్లడించింది. ప్రజల అభిప్రాయాల్లో జాక్ మా ప్రభావం పెరుగుతున్నదన్నదని చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతుండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. చైనా ఆర్థిక సంస్థలు తాకట్టు దుకాణాల్లా వ్యవహరిస్తున్నాయని గతేడాది ఓ బహిరంగ సభలో జాక్ మా తూర్పారబట్టడంతో ఆయనపై జిన్పింగ్ సర్కార్ కక్షగట్టిన విషయం విదితమే.