స్టాక్హోం: ప్రముఖ ఫిన్లాండ్ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ నోకియా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్లాన్లో భాగంగా వచ్చే రెండేండ్లలో 10వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్లు మంగళవారం ప్రకటించింది. తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా పరిశోధనా రంగంపై మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు నోకియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లుండ్మార్క్ తెలిపారు. తమ ప్రత్యర్థి సంస్థ ఎరిక్సన్తో పోటీ పడేందుకు సంస్థలో సమూల మార్పులతో పరివర్తన తేనున్నట్లు వెల్లడించారు.
పది వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన ద్వారా సంస్థ 2023 నాటికి 715 మిలియన్ల డాలర్లు (600-700 మిలియన్ల యూరోలు) ఆదా చేయనున్నది. ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులపై పడే ప్రభావాన్ని తాము తేలిగ్గా కొట్టిపారేయడం లేదని నోకియా స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరికీ మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నది. ఇదిలా ఉంటే, సంస్థ దీర్ఘకాలిక వ్యూహాన్ని గురువారం పెక్కా లుండ్మార్క్ వెల్లడించనున్నారు. కార్యాచరణ ప్రణాళిక, ఆర్థిక లక్ష్యాలను కూడా ప్రకటించనున్నారు.
తాము 5జీ టెక్నాలజీపైనే కేంద్రీకరించినట్లు నోకియా తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020లో 21.9 బిలియన్ల యూరో ఆదాయంతో పోలిస్తే 2021లో 20.6-21.8 బిలియన్ల యూరోల (25-26 బిలియన్ల డాలర్ల) మధ్య ఉంటుందని గతనెలలోనే నోకియా అంచనా వేసింది. నోకియాతోపాటు ఫిన్లాండ్కే చెందిన ఎరిక్సన్ కూడా 5జీ నెట్వర్క్లో మరింత మంది కస్టమర్లను తమ ఖాతాలో జమ చేసుకుంటున్నాయి.