న్యూఢిల్లీ, మార్చి 15:టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కోరలు చాచుతున్నది. ఆహార, విద్యుత్, చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ ధరల సూచీ ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. జనవరిలో 2.03 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ ఏడాదిక్రితం ఇదే నెలలో 2.26 శాతంగా ఉన్నది. దీంతో ధరల సూచీ 27 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు అయింది. వరుసగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఆహార పదార్థాల ధరల సూచీ గత నెలలో 1.36 శాతంగా నమోదవడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. అయినప్పటికీ కూరగాయల ధరల సూచీ ప్రతికూలంగానే(- 2.90 శాతం) కొనసాగుతుండటం విశేషం. అలాగే పప్పుదినుసులు 10.25 శాతం, పండ్లు 9.48 శాతం, చమురు 0.58 శాతంగా నమోదయ్యాయి. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన రిజర్వుబ్యాంక్ అంచనావేసినట్లు ద్రవ్యోల్బణం కొరలు చాచనున్నదని అంచనాలు నిజమవుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.