హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. దాదాపు క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది. మొత్తం 11 మున్సిపల్ కార్పొరేషన్లకు అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్నది. 75 మున్సిపాలిటీలకు 74 చోట్ల విజయం సాధించింది. అందరి దృష్టిని ఆకర్షించిన గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ జెండా ఎగిరింది. వీటితోపాటు పట్టున్న చిత్తూరు, కడప, కర్నూలులోనూ టీడీపీకి ఊహించని దెబ్బ పడింది. ఎంతో కొంత ప్రభావం చూపిస్తామని భావించినా మెజార్టీ ప్రాంతాల్లో సత్తా చాటలేక చతికిలపడింది. పలువురు కీలక నేతల ఇలాకాలోనూ టీడీపీకి ఎదురుగాలి వీచింది. విశాఖపట్నం కార్పొరేషన్లో మొత్తం 98 డివిజన్లకు 58 వైసీపీ గెలువగా, టీడీపీ 30, జనసేన 3 స్థానాల్లో గెలిచాయి. గుంటూరులో 57 డివిజన్లకు వైసీపీ 45, టీడీపీ 8, బీజేపీ 4 డివిజన్లు గెలుచుకున్నాయి. విజయవాడలో వైసీపీ 33 డివిజన్లు, టీడీపీ 12 డివిజన్లలో విజయంసాధించాయి. 11వ డివిజన్ నుంచి టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత గెలుపొందారు. విజయవాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ఈ నెల 18న జరుగుతుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. హిందుపురంలో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. ఒక డివిజన్లో మజ్లిస్ అభ్యర్థి గెలుపొందారు. తిరుపతి కార్పొరేషన్లోని 50 డివిజన్లకు 48 స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకున్నది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న తిరుపతి పరిధిలో వైసీపీ క్లీన్స్వీప్ చేయడం గమనార్హం. ఈ విజయంతో వైసీపీలో జోష్ పెరిగింది. కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. జేసీ బ్రదర్స్ అడ్డాగా పేరొందిన తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకున్నది. ఇక్కడ 36 స్థానాలకు 18 చోట్ల టీడీపీ, 16 చోట్ల వైసీపీ, సీపీఐ 1, ఇతరులు ఒక చోట గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి వైసీపీకి దీటుగా నిలువాలనే ఉద్దేశంతో ఇటు చంద్రబాబు, అటు లోకేశ్ విస్తృతంగా ప్రచారంచేశారు. ముఖ్యంగా వైజాగ్, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లపై దృష్టిపెట్టారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం వైసీపీ టీడీపీ
కార్పొరేషన్లు 11 11 0
మున్సిపాలిటీలు 75 74 1