ఎస్బీఐ ఆకర్షణీయ పథకం
మనలో ఎవరైనా సరే.. పెట్టుబడుల ద్వారానే భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటాం. అయితే కొన్నిసార్లు ఈ పెట్టుబడులు లాభాన్నివ్వకపోగా.. అనేక సమస్యలను తెచ్చిపెడుతాయి. అందుకే సరైన చోటే మదుపు చేయాలి. అన్నివిధాలా ఆరా తీసిగానీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవద్దు. సురక్షిత పెట్టుబడుల కోసం నమ్మకమైన జాతీయ సంస్థలు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలను ఆశ్రయించడం మంచిది. ఇలాంటి వారికోసమే ఎస్బీఐ ఓ యాన్యుటీ స్కీంను అందుబాటులోకి తెచ్చింది.
36, 60, 84, 120 నెలల వ్యవధితో ఎస్బీఐ యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో టర్మ్ డిపాజిట్తో సమానంగా వడ్డీరేటును పొందవచ్చు. ఐదేండ్లకుగాను పెట్టుబడి పెడితే.. ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లే వర్తిస్తాయి.
నెలనెలా రూ.10వేల ఆదాయాన్ని అందుకోవాలంటే.. ఎస్బీఐలో 5 లక్షల 7,964 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై 7 శాతం నుంచి వడ్డీరేటును పొందవచ్చు. ఇది దాదాపు రూ.10వేల నెలసరి ఆదాయానికి సమానం. మన పెట్టుబడులు పెరిగినకొద్దీ రాబడి కూడా పెరుగుతూపోతుంది.
ఎస్బీఐ యాన్యుటీ పథకంలో మదుపు చేయాలనుకునేవారు నెలనెలా కనీసం వెయ్యి రూపాయలకు తగ్గకుండా డిపాజిట్ చేయాల్సిందే. గరిష్ఠ పరిమితి ఏమీలేదు. ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. నిర్ణీత వ్యవధి తర్వాత డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీరేటు లెక్కింపు ఉంటుంది. ఆపై మదుపరికి చెల్లింపులు మొదలవుతాయి.
మధ్యతరగతి వర్గాలకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు లభించడం కష్టం. కాబట్టి ఈ యాన్యుటీ ప్లాన్ కంటే రికరింగ్ డిపాజిట్ వారికి మేలని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ తమ నగదు నిల్వలనుబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా లాభమేనని సూచిస్తున్నారు.