ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులపై దోపిడీ ముఠా దాడికి తెగబడింది. కార్టర్ రోడ్లో ఓ వ్యక్తిపై దోపిడీ దొంగలు కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకున్న ఇద్దరు మహిళలపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. నగరంలోని ఖర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా దోపిడీ దొంగలు వ్యక్తి మొబైల్ ఫోన్ను అపహరించి పరారయ్యారు. దోపిడీ ముఠా దాడిలో ఈవెంట్ మేనేజర్గా పనిచేసే 33 ఏండ్ల బాధితుడి చేతికి ఐదు కుట్లు పడ్డాయి.
ఘటన జరిగిన 12 గంటల్లోనే ముంబై పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవెంట్ మేనేజర్పై దాడిని అడ్డుకున్న ఇద్దరు మహిళలపైనా నిందితులు కత్తితో దాడి చేసేందుకు యత్నించినా వారు క్షేమంగా బయటపడ్డారని స్ధానికులు అక్కడికి చేరుకోవడంతో దోపిడీ ముఠా పరారైందని పోలీసులు తెలిపారు. నిందితులను సలీం ఫిరోజ్, మహ్మద్ వసీం, కలాం మన్సూరీగా గుర్తించారు.