హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 4 (నమస్తే తెలంగాణ): దక్కన్ పీఠభూమి.. ప్రపంచంలో ఏ మెట్రో నగరానికీ లేని అనుకూల వాతావరణం.. అటు తుఫాన్లు ఇటు భూకంపాల భయంలేని ప్రదేశం.. గుడిసెలోని నిరుపేద నుంచి కోట్ల విలువచేసే ఇంధ్రభవనంలోని ధనవంతుడు సైతం ప్రశాంతంగా జీవించే మినీ భారతం! ఇదీ చారిత్రక హైదరాబాద్ ప్రత్యేకత. సాధారణ పౌరుడి మాటల్లోనే కాదు.. అంతర్జాతీయ సంస్థల సర్వేల్లోనూ వెల్లడైన వాస్తవాలివి. ఇందుకు నిదర్శనం 2015 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు బెస్ట్ సిటీ ఇన్ క్వాలిటీ లివింగ్ (ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన జీవనం సాగించగలిగే నగరం)గా మొదటి ర్యాంకులను సాధించడం. అంతేకాదు.. ప్రపంచ వృక్ష నగరంగా ఇటీవలనే హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. కానీ.. కేంద్ర ప్రభుత్వానికి ఇవేవీ కనిపించలేదు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్ను 24వ స్థానంలో నిలిపింది. కేంద్రం నివేదిక హైదరాబాద్ మహానగరంపై విషం కక్కటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 జనవరి నుంచి మార్చి వరకు దేశంలోని 111 నగరాల్లో నిర్వహించిన ఒక సర్వే నివేదికను తాజాగా వెల్లడించింది. ప్రశాంత జీవనం సాగించగలిగిన నగరాలపై నిర్వహించిన సర్వేలో బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వరుసగా తొలి మూడు స్థానాలలో నిలిచాయి. హైదరాబాద్కు 55.40 స్కోర్ను ఇచ్చిన కేంద్రం 24వ ర్యాంకును కట్టబెట్టింది.
ప్రపంచంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్కు ప్రత్యేకత ఉన్న సంగతి పలు అంతర్జాతీయ సర్వేలలో అనేకసార్లు వెల్లడైంది. ప్రశాంతమైన నగరం, సానుకూలమైన వాతావరణం ఉండటం వల్లనే అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీలు పడుతూ హైదరాబాద్లో తమ పరిశ్రమలను, కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. గతంలో వెలువడిన అనేక సర్వేల్లో హైదరాబాద్ అత్యంత నివాసయోగ్య నగరంగా కీర్తికెక్కింది. ప్రధానంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన నివాసయోగ్య నగరం ఇండెక్స్లో 2015 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఉత్తమ నగరంగా నిలిచింది. జేఎల్ఎల్ సర్వేల్లో కచ్చితంగా టాప్-3 ర్యాంకుల్లో ఉన్నది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే ఆర్బర్డే ఫౌండేషన్ సంస్థ గత నెలలోనే హైదరాబాద్ను ప్రపంచ వృక్ష నగరంగా ప్రకటించింది. కానీ కేంద్రం హైదరాబాద్ ప్రతిష్ఠను దిగజారుస్తూ ర్యాంకింగ్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రాతిపదికన 24వ ర్యాంకు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నివాసపరంగా అత్యంత ఖరీదైన బెంగళూరుకు మొదటిస్థానం, కలుషిత వాయువులతో ప్రజల ప్రాణాలు పోతున్న ఢిల్లీకి 13వ స్థానాన్ని ఏ లెక్కన ఇచ్చారని నిలదీస్తున్నారు. కేంద్రం ప్రకటించిన జాబితాలో హైదరాబాద్కన్నా ముందున్న వాటిలో ఏడు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనివి ఉండగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడుకు చెందినవి మూడు నగరాలు ఉన్నాయి.
‘ప్రపంచమే హైదరాబాద్ వైపు చూస్తున్నది, దిగ్గజ కంపెనీలు సైతం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. కానీ బెస్ట్ లివబుల్ సిటీ ర్యాంకింగ్లో మాత్రం హైదరాబాద్కు గుర్తింపు లభించలేదు’ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వాపోయారు. కేంద్రం చేపట్టిన సర్వేలో హైదరాబాద్కు సరైన న్యాయం జరుగలేదని అన్నారు. ఏ ప్రాతిపదికన సర్వే చేపట్టారో స్పష్టత లేదని, ఇది పూర్తిగా అసత్యమైనదని, ర్యాంకింగ్ కేటాయింపులు పారదర్శకంగా చేయాలని పేర్కొన్నారు.