అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో గత శనివారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని డీజీసీఏ తేల్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టులో ఫిబ్రవరి 20న (శనివారం) ఎయిరిడియా ఎక్స్ప్రెస్ బోయింగ్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరానికి వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఒక రెక్క స్వల్పంగా దెబ్బతిన్నది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 64 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానానికి పైలెట్ తప్పిదమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు విమానాన్ని కెనడాకు చెందిన మహిళా పైలట్ నడుపుతున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నేడు కూడా విచారణ కొనసాగనుంది.