మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
పీహెచ్సీ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణీ
దవాఖాన ఆవరణలో హరితహారం
బజార్హత్నూర్, జూలై 18 : మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రభుత్వేతర యంత్రాంగం కృషి చేయాలని మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలకేంద్రంలోని తిరుమల గార్డెన్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను జస్టిస్ చంద్రయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గిరిజనులు తక్కువగా ఉన్న గ్రామాన్ని ఏజెన్సీగా, గిరిజనులు లేని గ్రామాన్ని నాన్ ఏజెన్సీగా ప్రకటించడంతో గిరిజనులు, గిరిజనేతరులు అనేక నష్టాలు పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇరువురికి సమన్యాయం జరగాలంటే పార్లమెంట్ ద్వారా బిల్లు పాస్ చేయించి కొత్తగా రీ సర్వే చేయాలని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల ద్వారా పై విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కరోనా కష్టకాలంలో తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను అభినందించారు. చైర్మన్ తుల అరుణ్కుమార్ను సన్మానించారు. వైద్యసిబ్బందిని, పాత్రికేయులను అభినందించి సన్మానించారు. అంతకుముందు చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు గిరిజనులు సంప్రదాయబద్ధమైన డోలువాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. పీహెచ్సీలోని పలు వార్డులను చైర్మన్ పరిశీలించారు. ఏడో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, డీఎంహెచ్ వో రాథోడ్ నరేందర్, ఓఎస్డీ హర్షవర్ధ న్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా న్యా యాధికారులు, ఎంపీపీ జయశ్రీ, జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, తుల సుభా ష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ అరుణ్, జిల్లాలోని ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.