ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో సర్వం సిద్ధం
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
రూట్ మ్యాప్ సిద్ధం.. భారీగా పోలీస్ బందోబస్తు
కంట్రోల్ రూం ఏర్పాటు.. ఫోన్ నంబర్లు 100
అగ్నిమాపక,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాంపులు
నిర్మల్ అర్బన్/భైంసా, సెప్టెంబర్ 17;నవరాత్రులు విశేష పూజలందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకునే సమయం ఆసన్నమైంది. నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం భైంసాలో, ఆదివారం నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి.. వెయ్యి మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయగా.. అగ్నిమాపక, ఆరోగ్య, మున్సిపల్, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో క్యాంపులు ఏర్పాటు చేశారు.
భైంసా, సెప్టెంబర్, 17 : భైంసాలో శనివారం గణేశ్ నిమజ్జనం జరగనున్నది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
పకడ్బందీగా నిఘా ..
బస్టాండ్, పంజేషాచౌక్, నిర్మల్ చౌరస్తా, మార్కెట్ ఏరియా, కుభీర్ చౌరస్తాతో పాటు తదితర ప్రధాన కూడళ్లలో గతంలో 100 వరకు సీసీ కెమెరాలు ఉండగా, తాజాగా 1500 ఏర్పా టు చేశారు. వీటితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ సమీక్షిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లోని విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లతో ప్రమాదం లేకుండా చూడాలని సిబ్బందికి అధికారులు సూచించారు. పట్టణంతో పాటు గ్రామాల్లో వైన్స్లు, బెల్టు షాపులు శుక్రవారం నుంచే మూసివేయించారు.
భారీ బందోబస్తు
ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో వెయ్యికి పైగా మందితో బం దోబస్తును సిద్ధం చేశారు. అంతేగాకుండా నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ భైంసాలో మకాం వేసి పరిశీలిస్తున్నారు. ఎస్ ఐ, ఆర్ఎస్ఐ 31, సీఐలు 10, ఏఎస్ఐలు 56, ఏఎస్పీలు ఇద్ద రు, డీఎస్పీలు ముగ్గురు, పోలీసు కానిస్టేబుళ్లు 196, డబ్ల్యూపీసీ ఐదుగురు, హోంగార్డులు 21 అంతేగాకుండా బైక్ పెట్రోలింగ్ ఆరుగురు, రూప్టాప్ 8, కంట్రోల్ టీమ్ ఒకటి, ఒక వజ్రాయుధం, బాంబ్ స్కాడ్ బృందం కూడా పర్యవేక్షించనున్నారు. పోలీస్స్టేషన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడా సమస్య తలెత్తినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే కవాతు నిర్వహించారు.
సమావేశాలతో అప్రమత్తం
ఇప్పటికే పట్టణంలో శాంతి సమావేశం, ఉత్సవ కమిటీ గణేశ్ మండపాలు, యువజన సంఘాల సభ్యులతో ఏఎస్పీ, కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నిమజ్జనోత్సవ శోభయాత్ర ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలని కోరారు.
ఏర్పాట్లు పూర్తి..
నిమజ్జనోత్సవం కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఎంఏ అలీమ్ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రోడ్లపై గుంతలను పూడ్చిన అధికారులు గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద భారీ కేడ్లను కట్టారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్లు అందుబాటులో ఉంచారు. గజ ఈతగాళ్లను పెట్టారు.
శోభాయాత్ర ఇలా..
భైంసాలో నాటి నుంచి నేటి వరకు ఒకేమార్గం గుండా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. భట్టిగల్లిలో, మున్నూరుకాపు సంఘం, గోపాలాకృష్ణ మందిరంలోని గణేశ్ వద్ద ప్రతిష్ఠించిన వినాయకుల వద్ద ఎస్పీ, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి గణేశ్ నగర్ మీదుగా కోర్భగల్లి, పంజేషా చౌక్, కిసాన్ గల్లి, పురాణా బజార్ మీదుగా ప్రాజెక్టు వరకు సాగుతుంది. కాలనీ, ఫూలేనగర్, రాజీవ్నగర్, తదితర కాలనీల్లో బస్టాండ్ మీదుగా మార్కెట్ ఏరియా కలిసి ప్రాజెక్టు మీదికి చేరుకుంటాయి.
రేపు నిర్మల్, ఖానాపూర్లో..
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 17 : జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భైంసాలో నేడు (శనివారం), నిర్మల్, ఖానాపూర్లో ఆదివారం నిమజ్జనం చేయనున్నారు.
రూట్ మ్యాప్ సిద్ధం..
ఆయావార్డుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలను నంబర్ల ప్రకారం స్థ్ధానిక నగరేశ్వర వార్డుల్లో వరుస క్రమంలో కలుస్తాయి. బుధవార్పేట్, పాతబస్టాండ్, వివేకానంద చౌక్, రూరల్పోలీస్ స్టేషన్, నగరేశ్వర వార్డు, నిషాన్, కస్బా, ద్యాగవాడ, మార్కెట్, టౌన్పోలీస్ స్టేషన్, గాంధీచౌక్, సోమవార్పేట్, నాయుడివాడ, బంగల్పేట్ మీదుగా వినాయక్ సాగర్ వరకు శోభాయాత్ర కొనసాగి అక్కడ నిమజ్జనం చేయనున్నారు.