ఆపత్కాలంలోనూ ఆగని సంక్షేమం
విపక్షాలు ఆరోపణలకే పరిమితం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
రూ.7.20 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ
థర్డ్వేవ్పై అప్రమత్తంగా ఉండండి: జడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో అధికారులకు అమాత్యుడి ఆదేశం
నిర్మల్ అర్బన్, జూలై 16 : నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి జిల్లాలో ప్రతి నెలా ఓ బృహత్తర కార్యక్రమం చేపడుతామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన రెండెకరాల్లో రూ.7.20 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి సమీకృత మార్కెట్ నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. అన్ని మార్కెట్లు ఒకే చోట ఉంటే పట్టణ ప్రజలు, వ్యాపారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్తో చర్చించామన్నారు.
సిద్దిపేట, గజ్వేల్ తరహాలో సమీకృత మార్కెట్ నిర్మించాలని కోరిన వెంటనే ఆయన నిధులు మంజూరుచేశారని తెలిపారు. ముందుగా 160 దుకాణాలు నిర్మించాలని నిర్ణయించగా, పట్టణ వ్యాపారస్తుల సూచనలు, విజ్ఞప్తుల మేరకు 330కి పెంచామని చెప్పారు. ఇప్పటికే రూ. 5 కోట్లతో రోడ్డు సుందరీకరణ, రూ.2.70 కోట్లతో శివాజీ చౌక్లో వైకుంఠధామం, రూ.2కోట్లతో చేపల మార్కెట్, రూ.7.20 కోట్లతో సమీకృత మార్కెట్, జాతీయ జెండా ఏర్పాటు, రూ.3.50 కోట్లతోఅంబేద్కర్ భవనం, రూ.42 కోట్లతో 5 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. వందల కోట్లతో అభివృద్ధి జరుగుతున్నా కొందరి కండ్లకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చివరి దశలో ఉన్నదని, దీంతో పట్టణ ప్రజల తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూస్తామని తెలిపారు. గాంధీ పార్కులో ట్యాంక్ నిర్మాణం పూర్తయ్యిందని, రెండుమూడురోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు మెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరుచేయించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. త్వరలో తీసుకువస్తామని స్పష్టం చేశారు.
అనంతరం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణం ఏడాదిలో ఎంతో అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. 330 దుకాణాలు, 4 వైపులా ఎంట్రెన్స్తో 100 కార్లు, 400 బైకులు పార్కింగ్ చేసుకునే వీలుతో సమీకృత మార్కెట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడారు. అనంతరం మార్కెట్ నిర్మాణానికి కృషిచేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, చైర్మన్ ఈశ్వర్ను వ్యాపారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, వైస్ చైర్మన్ సాజిద్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏఈ వినయ్కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వంజర్లో మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన..
సారంగాపూర్, జూలై 16 : సారంగాపూర్ మండలం వంజర్లో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మీ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో దేవాలయాలకు పూర్వవైభవం సంతరించుకున్నదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గంలోని 500 ఆలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఇది తెలంగాణ సర్కారుతోనే సాధ్యమైందన్నారు. మహాలక్ష్మీ ఆలయానికి రూ.50 లక్షలు, భీమన్న ఆలయానికి రూ.10 లక్షలు, హన్మాన్ ఆలయానికి రూ.10 లక్షలు, నాగదేవత ఆలయానికి రూ.10 లక్షలు మంజూరుచేసి, పనులు పూర్తిచేయించామని వివరించారు. త్వరలోనే కౌట్ల(బీ) ఎక్స్ రోడ్డు నుంచి వంజర్ ఎక్స్రోడ్డు వరకు రోడ్డు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు మహిపాల మురళీకృష్ణ, సర్పంచ్ లస్మయ్య, ఎంపీటీసీ అగ్గం సరిత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెదలి మల్లయ్య, నాయకులు రాజ్మహ్మద్, శ్రీనివాస్రెడ్డి, కొరిపెల్లి రాజు, గంగాధర్, లింగారెడ్డి, కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.