మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీగా వస్తున్న వరద
సరస్వతీ ఆయకట్టుకు సాగునీటి అవసరాలు తీరినట్లే..
రేపు నీటిని విడుదల చేయనున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ టౌన్/సోన్, జూలై 13: గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుటున్నది. మహారాష్ట్రలో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ద్వారా శ్రీరాంసాగర్లోకి వరద వచ్చి చేరుతున్నది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు (90టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1078అడుగులకు (46. 699టీఎంసీలు) చేరింది. వర్షాకాలం సీజన్కంటే ముందు 1064 అడుగులు మా త్ర మే ఉండగా.. ఇప్పుడు 14 అడుగుల మేర కొత్త నీరు వచ్చి చేరడంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. సాధారణంగా జూన్, జూలై మాసంలో కురిసిన వర్షాలకు మహారాష్ట్రలోని విష్ణుపురి, గ్వైకాడ్, తదితర ప్రాజెక్టులు నిండిన తర్వాత జూలై చివరి వారంలో ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని గోదావరిలోకి వదిలితే ఆ నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండేది.
కానీ జూన్ నుంచే వర్షాలు కురుస్తుండడంతో అక్కడి ప్రాజెక్టులు నిండడంతో ఇప్పుడు కురుస్తున్న వర్షపునీరు మాత్రం గోదావరి ద్వారా శ్రీరాంసాగర్లోకి వచ్చి చేరుతున్నది. మహారాష్ట్రలోని భోకర్, ధర్మాబాద్, నాందేడ్, పర్బని, జాల్న తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్లోకి భారీగా వరద వస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 95వేల క్యూసెక్కుల వరద రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు 70వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరద ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1080 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో వర్షాలు లేకపోయినా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు శ్రీరాంసాగర్ ఆశలు పెంచుతున్నాయి. శ్రీరాంసాగర్ ద్వారా సరస్వతీ కెనాల్ కింద నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లో 36వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. సరస్వతీ కెనాల్ శ్రీరాంసాగర్ పరిధిలోని 1045 అడుగుల ఎత్తులో ఉండడంతో ఈ వానకాలానికి అవసరమయ్యే నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. దీంతో ఆయకట్టు రైతులకు పూర్తి భరోసా ఏర్పడింది. అయితే జూలై రెండో వారం నుంచి ఆగస్టు వరకు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ఏడాది కూడా శ్రీరాంసాగర్ పై పూర్తిస్థాయిలో నిండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఇన్చార్జి ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు.
రేపు సరస్వతీకి నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు నీటి విడుదల కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి గురువారం సోన్ మండలంలోని గాంధీనగర్ వద్ద ఉన్న లెఫ్ట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వానకాలం పంటకు సిద్ధమవుతున్న రైతులు ఆయకట్టు కింద నార్లు పోసుకొని వరినాట్లకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొదటగా సరస్వతీ కెనాల్ ద్వారా విడుదలైన నీటితో ఆయకట్టు కింద ఉన్న చెరువులు నింపనున్నట్లు అధికారులు తెలిపారు.