నిర్మల్ జిల్లాలో 1.52 మందికి మొదటి, 40 వేల మందికి రెండో డోస్
ఆసక్తి చూపుతున్న ప్రజలు
అవగాహన కల్పిస్తున్న సిబ్బంది
నిర్మల్చైన్గేట్, జూలై 13 : నిర్మల్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కరోనా నియంత్రణకు స్వీయరక్షణతో పాటు టీకా ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వం సూచిస్తున్నది. ఇందుకు తగినట్లుగానే టీకా కార్యక్రమం వేగవంతం చేసింది. అందుకు అనేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,52,192 మంది మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే 40,364 మంది రెండో డోస్ టీకా వేసుకున్నారు.
వ్యాక్సిన్పై అవగాహన..
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ చేపట్టింది. ప్రారంభంలో వైద్య, పారిశుధ్య సిబ్బందికి టీకా ఇచ్చింది. ఆ తర్వాత అందరికీ అందించాలని నిర్ణయించింది. వైద్య సిబ్బంది ఇప్పటికే గ్రామాల్లో అవగాహన కల్పించారు.
1.52 లక్షల మందికి మొదటి, 40 వేల మందికి రెండో డోస్..
టీకా తీసుకునేందుకు వృద్ధులు సైతం ఆసక్తి చూపుతున్నారు. 80 ఏండ్లు దాటిన వారు కూడా దవాఖానకు వస్తున్నారు. జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ముఖ్యమైన దవాఖానల్లో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ముందస్తు రక్షణగా టీకా తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 45-59 ఏండ్లలోపు వారు 83,478 మంది, 60 ఏళ్లు పైబడిన వారు 36,123 మంది, 18 నుంచి 44 ఏండ్లలోపు వారు 25,008 మంది, హెల్త్ కేర్ వర్కర్స్ 4,490 మంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ 3,093 మంది టీకా తీసుకున్నారు. అలాగే రెండో డోస్ 40,364 మంది తీసుకున్నారు. ఇందులో 45-59 ఏండ్లలోపు వారు 20,589 మంది, 60 ఏళ్లు పైబడిన వారు 10,375 మంది, 18 నుంచి 44 ఏళ్లలోపు వారు 2,244 మంది, హెల్త్ కేర్ వర్కర్స్ 4,391 మంది ఫ్రంట్లైన్ వారియర్స్ 2,765 మంది టీకా తీసుకున్నారు.