ముథోల్, అక్టోబర్, 26 : బృహత్ ప్రకృతి వనంలో వెంటనే మొక్కలు నాటాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. ముథోల్ మండలం బోరిగాంలో బృహత్ ప్రకృతి వనం స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. పదెకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో సురేశ్బాబు, ఎంపీవో అమీర్ ఖాన్, ఏపీవో శిరీష తదితరులు పాల్గొన్నారు.
భైంసాను సందర్శించిన నిర్మల్ కలెక్టర్
భైంసా పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహ ధ్వంసం చోటుచేసుకోగా మంగళవారం సంఘటనా స్థలాన్ని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కలెక్టర్కు వినతిపత్రం అందించి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు అవమానం జరగడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఇక్కడ విగ్రహ ఏర్పాటు అనంతరం పూర్తి భద్రత కల్పించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చెక్కును విగ్రహ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, కమిషనర్ ఎంఏ అలీమ్, తహసీల్దార్ విశ్వంబర్, స్టాచ్యూ కమిటీ అధ్యక్షుడు ప్రసన్నజిత్ ఆగ్రే, మైసేకర్ సాయిలు, శంకర్ చంద్రే, గౌతం పింగ్లే, గిరిధర్ జంగ్మే తదితరులు పాల్గొన్నారు.
భూ సేకరణ పనులు పూర్తి చేయాలి
జిల్లాలో 27వ ప్యాకేజీ భూసేకరణ పనులను వందశాతం పూర్తి చేసి రెండు రోజుల్లో డ్రాప్టు నోటిఫికేషన్ ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో భూసేకరణపై జిల్లా ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల, రెవెన్యూ, ల్యాండ్ రికార్డు అధికారులు సంయుక్తంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరిస్తే పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. 50వేల ఎకరాలకు లిఫ్టు ద్వారా 27వ ప్యాకేజీ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దిలావర్పూర్, నర్సాపూర్, కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు 27వ ప్యాకేజీలో భూములు కోల్పోయారని, ఇప్పటికే ఆయా గ్రామాల రైతులకు పరిహారం అందించామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాంబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్రవంతి, నీటి పారుదలశాఖ ఈఈ రామారావు ఉన్నారు.