బోథ్, నవంబర్ 25: బోథ్ మండలంలో రైతులు యాసంగి కింద శనగ, మక్క, గోధుమ, జొన్న, ధనియాలు, కూరగాయాలు తదితర పంటలను సాగు చేస్తారు. వానకాలం కింద సాగు చేసిన సోయాబీన్, మినుము, పెసర పంటలు ఖాళీ కావడంతో వాటిలో ఈ పంటలను వేస్తారు. ఆరేళ్ల కిత్రం వరకు వర్షాలు అనుకూలించకపోవడంతో పాటు ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు నిలువక భూగర్భ జలాలు అంతంత మాత్రంగానే ఉండేవి. దీనికి తోడు ఐదారు గంటలకు మించి కరెంట్ వచ్చేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంది. భూగర్భ జలం భూసమాంతరానికి చేరుకోవడంతో బోరుబావుల్లో కూడా నీరు చేరుకుంటున్నది. 24 గంటల త్రీఫేజ్ సరఫరాతో రైతులు యాసంగి కింద పంటలను విరివిగా సాగు చేస్తున్నారు. మూడేండ్ల క్రితం వరకు తొమ్మది వేలలోపే యాసంగి సాగు విస్తీర్ణం ఉండగా, ఈ యేడాది 13 వేలకు చేరుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు భూముల్లో ట్రాక్టర్లు, ఎడ్లు నాగళ్ల సాయంతో దుక్కులు దున్ని పంట విత్తనాలు వేస్తున్నారు. ప్రస్తుతం శనగ, మక్క విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
పన్నెండెకరాల్లో సాగు చేస్తున్నా..
యాసంగిలో పన్నెండెకరాల్లో పంటలు సాగు చేస్తున్న. పదెకరాల్లో శనగ, రెండెకరాల్లో జొన్న పంటను వేస్తున్న. వర్షాలు బాగా పడడంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉంది. ప్రభుత్వం 24 గంటల త్రీఫేజ్ కరంట్ ఇస్తుండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే నీటి తడులు ఇవ్వడం పూర్తవుతున్నది. గతంలో కరంట్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. నీరు, కరంట్ సమస్యలన్నీ తీరిపోయాయి. ప్రభుత్వం పెట్టుబడికి సాయం చేస్తున్నది.
నీరు పుష్కలంగా ఉంది..
వర్షాలు బాగా పడడంతో పంటలకు నీరు పుష్కలంగా అందుతున్నది. బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంటున్నది. ప్రభుత్వం 24 గంటల కరంట్ అందిస్తున్నది. దీంతో అవసరమున్నప్పుడు తడులు అందిస్తున్నం. నాలుగున్నర ఎకరాల్లో శనగ, ఎకరా పొలంలో మొక్కజొన్న పంట వేసిన. పత్తి పంట తీసి మరో పంట వేయడానికి సిద్ధమవుతున్న. ఈ యాసంగిలో పంటలకు ఢోకా లేకుండా పోయింది.
-మార కిరణ్కుమార్రెడ్డి, రైతు, ధన్నూర్ (బీ)